అమరావతికి మహార్దశ: 2018లో జరిగే జాతీయ క్రీడలకు ఆతిథ్యం?
అమరావతి: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో 2018 జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏపీ కార్మిక, క్రీడా శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మేరకు రాజధాని అమరావతిలో అత్యాధునిక క్రీడా గ్రామాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు ఆయన తెలిపారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇందుకోసం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడితో మాట్లాడామని, స్థలం నిర్ణయించి స్టేడియాలు నిర్మించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 74 స్టేడియాలను నిర్మించాలని ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
వీటిలో ఆరు ఇండోర్ స్టేడియాలు, ఓ భారీ ఓపెన్ ఎయిర్ స్టేడియం నిర్మించాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో ఆర్చరీని ప్రోత్సహించేందుకు అరకు, తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో స్టేడియాలను నిర్మిస్త్నుట్లు చెప్పారు.
ఉత్సాహవంతులైన క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు పెద్దయెత్తున కోచ్లను నియమించనున్నట్టు ఆయన చెప్పారు. మరోవైపు విశాఖపట్నంలో జరగనున్న నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎర్రన్నాయుడు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే నెల 20, 21న నేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీలు జరుగనున్నాయి.
ఇదిలా ఉంటే రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రతిగా ప్లాట్లు కేటాయించేందుకు సీఆర్డీఏ చేపట్టనున్న ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని నేలపాడు గ్రామంలో ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదగా రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తైన సంగతి తెలిసిందే.
ఇదే రీతిలో ఇతర గ్రామాల లేఅవుట్లపైనా సీఆర్డీఏ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోవైపు స్థానిక సీఆర్డీఏ కాంపిటెంట్ కార్యాలయాల నుంచి 9.18 దరఖాస్తులను ఆనలైనలో అప్లోడ్ చేసే ప్రక్రియ వేగంగా సాగుతోంది. ప్లాట్ల కేటాయింపులో భాగంగా రైతులకు కావలసిన ప్లాట్లు ఉమ్మడిగానా, లేక విడిగా ఉండాలా అనే విషయాలను 9.18 దరఖాస్తుల ద్వారా కోరుకోవాలని సీఆర్డీఏ ఇప్పటికే ప్రకటించింది.