సోమిరెడ్డి కాళ్లు పట్టి మంత్రి అయ్యాడు, ఇప్పుడు మొరుగుతున్నారేం: టీడీపీపై అంబటి
విజయవాడ: స్టీల్ ప్లాంటుపై తెలుగుదేశం పార్టీ నేతలు గావుకేకలు పెడుతున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు గురువారం నిప్పులు చెరిగారు. కొన్ని సంస్థల ఏర్పాటుపై ఆరు నెలల్లో ఫిజిబిలిటీ చూడమని చట్టంలో చెప్పారని గుర్తు చేశారు. స్టీల్ ప్లాంట్ రాదని సెయిల్ రిపోర్ట్ ఇచ్చిన రోజు మాట్లాడని టీడీపీ నేతలు ఇప్పుడు ఎందుకు మొరుగుతున్నారని ధ్వజమెత్తారు.
నాలుగేళ్ల పాటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు మొక్కి ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. దొడ్డిదారిన మంత్రి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. కాళ్లు పట్టుకొని మంత్రి అయిన వ్యక్తి ప్రతిపక్ష నేతను ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు.
కడపలో ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదని గతంలో చెప్పారని, కానీ అపుడు ఎన్డీయేలో టీడీపీ ఉంది కాబట్టి ఏమీ మాట్లాడలేదన్నారు. ఆరునెలల్లో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేపడుతామని, ఆ మేరకు విభజన చట్టంలోని 13 వ షెడ్యూల్లో ఉందన్నారు. దొంగలు పడ్డ ఆరునెలలకు టీడీపీ నేతలు మొరుగుతున్నారన్నారు.
ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబులు కలిసి రాష్ట్రాన్ని అన్యాయం చేశారన్నారు. విభజన హామీలపై చివరిదాకా పోరాడేది వైసీపీనే అన్నారు. కేవలం ప్రజలను మభ్య పెట్టేందుకు టీడీపీ దీక్షల డ్రామాలాడుతోందన్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని ప్రజలు తిరస్కరించారన్నారు. అలాంటి వ్యక్తి జగన్ను విమర్శించడమా అన్నారు. టీడీపీ నేతలు ముందు కుస్తీ పోటీలంటారని, ఆ తర్వాత మోడీ కాళ్లు పట్టుకుంటారన్నారు.