అమరావతిని లేపడానికి మా ఊరు ముంచేశారు..! అంబటి సోదరుడి షాకింగ్..!
ఏపీలో తాజాగా వచ్చిన కృష్ణానది వరదలు మరోసారి అమరావతిలో జనానికి చుక్కలు చూపించాయి. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో వీటి ప్రభావం బాగా కనిపించింది. వరద ధాటికి అమరావతి రాజధానిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు భవనాలు, కట్టడాలు నీట మునిగి ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మరో ప్రాంతం పాలిట శాపంగా మారిందని వైసీపీ ఆరోపిస్తోంది.
అమరావతి కోసం పొన్నూరు నియోజకవర్గంలో 72 వేల ఎకరాల పొలాల్ని ముంచేశారని వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం అమరావతిని బతికించుకోవడం కోసం కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం ఛానళ్లకు మళ్లించి పొన్నూరులో పొలాల ముంపునకు కారణమైందన్నారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, అందుకు వారు ప్రభుత్వాన్ని ఎప్పటికీ క్షమించరని తెలిపారు.

ప్రభుత్వ కుట్ర వల్ల పొన్నూరు నియోజకవర్గంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా మంత్రులు, ఎమ్మెల్యేలు కనీసం రివ్యూ చేసి ఎన్యుమరేషన్ చేయించకుండా చోద్యం చూడటం బాధాకరమని అంబటి విమర్శించారు. పంటలు మునిగి రైతులు నష్టపోయి వ్యవసాయానికి దూరమైతే పొలాలను రియల్ వెంచర్లుగా మార్చి రూ.3 వేల కోట్లు దోచుకోవాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుట్ర చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రాదని భావిస్తున్న నరేంద్ర, నియోజకవర్గ రైతాంగాన్ని పూర్తిగా గాలికొదిలేశారన్నారు.

ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించిందని, అయినా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని అంబటి ఆరోపించారు. మరోవైపు రాజధాని అమరావతి కోసం పొన్నూరు రైతులను కొండవీటి వరదనీటితో ముంచారన్నారు. పంటలు నీటమునిగి రైతులు దుర్భర పరిస్థితుల్లో ఉన్నా మంత్రులు కానీ, కూటమి ఎమ్మెల్యేలు కానీ పొలాల వైపు కన్నెత్తి కూడా చూసిన పాపానపోవడం లేదన్నారు. పంట నష్టంపై అధికారులను నివేదిక కోరినట్టు కూడా ఎక్కడా వార్తలు కూడా లేవన్నారు. రైతుల సమస్యలతో ప్రభుత్వానికి సంబంధమే లేదన్నట్టు వారి సమస్యలు అసలు సమస్యలే కావన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.
పొన్నూరు నియోజకవర్గంలో గుంటూరు ఛానల్ 17 కి.మీ మేర ప్రవహిస్తుందని, దీనికి గతేడాది గండ్లు పడ్డాయని తెలిపారు. దాంతో ఇప్పుడు వరదనీటికి గండ్లు తెగి వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రని రైతులు కోరినప్పుడు నల్లపాడు నుంచి గ్రావెల్ తెచ్చి వేస్తున్నామని చెప్పారని, కానీ పంట కాలువల్లోని నల్ల మట్టిని తెచ్చి ఆ గండ్లు పూడ్చేయించారన్నారు. తూటికాడు తీయమంటే గడ్డి మందు స్ప్రే చేసి వదిలేశారన్నారు. దీనికి సాగునీటి సంఘాలు రూ.24 లక్షల బిల్లులు పెట్టుకున్నాయి. ఎండినట్టే ఎండి మళ్లీ వర్షాలతో గడ్డి పెరిగిపోయిండి. వర్షాలకు ఈ తూటికాడు తూములకు అడ్డం పడి నంబూరు దగ్గర కాలువలకు మూడు గండ్లు పడ్డాయన్నారు.












Click it and Unblock the Notifications