ముద్రగడతో విభేదాలున్నాయి, అయినా...: అంబటి రాంబాబు
ఏలూరు: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో తమ పార్టీకి రాజకీయపరమైన విబేధాలు ఉన్నప్పటికీ కాపుల సంక్షేమ దృష్ట్యా ఈనెల 31న తునిలో జరిగే కాపు గర్జనకు తరలి వెళ్లాలని తాము నిర్ణయించుకున్నా మని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చెప్పారు.
అదే విధంగా తెలుగు దేశం, కాంగ్రెస్, బీజేపీలో ఉన్న కాపు నేతలు కూడా గర్జనకు తరలి రావాలని ఆయన గురువారం మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో ఈనెల 31వ తేదీన మాజీ మంత్రి, రాష్ట్ర కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగే కాపు గర్జన సభ కు రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎమ్మెల్యే, రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ ఆర్టీసీ మజ్దూరు యూనియన్ అధ్యక్షులు పి.రవీంద్రనాథ్రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న అంబటి రాంబాబు చివరలో కాపు గర్జన సభ గురించి ప్రస్తావించారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభం కొత్తగా గొంతెమ్మ కోర్కెలు ఏమీ కోరడం లేదని, అకస్మాత్తుగా చేస్తున్న డిమాండ్లు కావని, చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలు అమలు చేయమని మాత్రమే ఆయన కోరుతున్నారని చెప్పారు.
చంద్రబాబు అధి కారంలోకి రావడం కోసం నిర్ణీత కాలవ్యవధిలో కాపులను బీసీల జాబితాలో చేరుస్తానని, బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఐదేళ్లలో రూ.5 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తానని అన్నారని అంబటి గుర్తు చేశారు.
ఆ వాగ్దానాలనే ముద్రగడ పద్మనాభం నిర్ణీత కాలవ్యవధిలో అమలు చేయమని కోరుతున్నారన్నారు. చేసిన వాగ్దానాలు అమలు చేయాలని కోరుతుంటే చిత్తశుద్ధి ప్రదర్శిం చకుండా కాపులను మళ్లీ మోసగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు.