చంద్రబాబుకు కరోనా టెస్టులు.. రిపోర్టులో తప్పులున్నాయని మండిపాటు..
మిగతా దేశాల సంగతేమోగానీ, మన దగ్గర మాత్రం మహమ్మారి కరోనా చుట్టూ రాజకీయాలు రాజుకున్నాయి. వైరస్ వ్యాప్తిని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు ఇష్టమొచ్చినట్లు అన్వయించుకుంటున్నాయి. మధ్యప్రదేశ్ లో కరోనా సాకు చూపించి కాంగ్రెస్ బలపరీక్ష తప్పించుకోవాలని ట్రై చేస్తే.. ఆంధ్రప్రదేశ్ లో అదే కరోనా కారణంతో ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసింది. ఆ క్షణం నుంచి వైసీపీ, టీడీపీ మధ్య వాదప్రతివాదాల్లో కరోనా కీలక స్థానాన్ని ఆక్రమించింది.
ఈక్రమంలోనే టీడీపీ అధినేత, మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు కరోనా టెస్టులు చేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ప్రభుత్వం తప్పుడు రిపోర్టులతో ప్రజల్ని మభ్యపెడుతున్నదని, మహమ్మారి పట్ల జగన్ సర్కారుకు కనీస అవగాహన లేదని ఆయన మండిపడ్డారు. ఏపీలో కరోనా చాపకింద నీరులా వ్యాపిస్తున్నదని, తమ వంతుగా దాన్ని అరికట్టేందుకే పార్టీ కేంద్ర కార్యాలయంలో కరోనా పరీక్షల కేంద్రాన్ని నెలకొల్పినట్లు బాబు వివరించారు.

మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో చీఫ్ చంద్రబాబుతోపాటు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు వరుసగా కరోనా థర్మల్ స్కానింగ్ చేయించుకున్నారు. బాబుకుగానీ, ఇతర నాయకులకుగానీ వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గానీ, మరే ఇతర నాయకులైనా, సాధారణ వ్యక్తులైనా పార్టీ ఆఫీసుకు వస్తే టెస్టులు చేయించుకున్న తర్వాతే లోనికి వదలాలని హైకమాండ్ నిర్ణయించింది.
Recommended Video
ఈ సందర్భంగా టీడీపీ.. ''ఏపీలో కరోనా లేదు కాబట్టి.. ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం లేదన్న వైసీపీ ప్రభుత్వం... అదే మాటను ఎన్నికల కమిషన్ కు మాత్రం ఎందుకు చెప్పలేదు? అంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఎస్ఈసీని విస్మరించినట్లేకదా''అని విమర్శించింది. టీడీపీ విమర్శలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ.. రాష్ట్రంలో ఇప్పటిదాకా ఒకే ఒక్క పాజిటివ్ కేసు నమోదుకాగా, ప్రభుత్వం అన్నిరకాల జాగ్రత్త చర్యలు చేపట్టిందని, చంద్రబాబు మాత్రం కరోనాను తానే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications