వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనే
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ సెంటర్ లో అగ్నిప్రమాదంపై సంచలన ఆరోపణలు చేసి, విజయవాడ పోలీసుల నుంచి వార్నింగ్ తిన్న హీరో రామ్ పోతినేని ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడంలేదు. అగ్నిప్రమాదంపైగానీ, రమేశ్ ఆస్పత్రి వివాదంపైగానీ మరోసారి మాట్లాడబోనంటూ ప్రకటించిన కొద్ది గంటలకే ఆయన మరో వివాదాస్పద అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అడ్డొస్తే రామ్ పోతినేనిపై చర్యలు - విజయవాడ ఏసీపీ వార్నింగ్ - అంతలోనే హీరో మరో ట్విస్ట్
ఏపీలో కుల విభేదాలు..
గడిచిన ఏడాది కాలంగా వైసీపీ సర్కారు తీసుకున్న పలు విధాన నిర్ణయాలు, అమలు చేయాలనుకున్న పథకాలు, కీలక పదవుల్లో నియామకాలకు సంబంధించి కోర్టుల్లో చిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. అయితే తమకు వ్యతిరేకంగా కమ్మ లాబీ కుట్రలు పన్నుతోందంటూ వైసీపీ కీలక నేతలు బాహాటంగా కామెంట్లు చేస్తుండటం, గతంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వివాదంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కులాల ప్రస్తావన తేవడం, తీర్పులపై వైసీపీ సోషల్ మీడియాలో కులం కోణాలపై విమర్శలు చేస్తుండటం లాంటి పరిణామాలు ఏపీలో నెలకొన్న కుల విభేదాలకు తార్కాణంగా నిలిచాయి. సరిగ్గా ఆ వివాదాస్పద కులం అంశంపైనే హీరో రామ్ పోతినేని తాజా ట్వీట్లు చేశారు.
కరోనా కంటే కులం డేంజర్..
స్వర్ణ ప్యాలెస్ రమేశ్ ఆస్పత్రి యజమానులు కమ్మ కులానికి చెందినవాళ్లు కాబట్టే అగ్నిప్రమాదంపై ప్రతిపక్షనేత చంద్రబాబుగానీ, టీడీపీ శ్రేణులుగానీ స్పందించలేదంటూ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, వైసీపీకి చెందిన ఇతర నేతలు విమర్శలు చేశారు. అంతలోనే, స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందంటూ హీరో రామ్ చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. తాజాగా ఆయన కులాలపై స్పందించారు. ‘‘కులం అనేది కరోనా మహమ్మారి కంటే అత్యంత ప్రమాదకరమైంది. మరింత వేగంగా వ్యాప్తి చెందుతోన్న కుల రక్కసి.. మనల్ని కూడా రచ్చలోకి లాగడానికి ప్రయత్నిస్తుంది. దానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది''అని రామ్ రాసుకొచ్చారు.
టిబెట్ లో చైనా అసాధారణ చర్య - వాంగ్ యీ ‘రీసెర్చ్' - డ్రాగన్కు షాకిచ్చిన మలేసియా
మాట్లాడనంటూనే ఘాటుగా..
రమేశ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ రమేశ్ బాబుకు బంధువుగా భావిస్తోన్న రామ్ కూడా కమ్మ కులస్తుడు కాబట్టే కలుగజేసుకున్నాడంటూ వైసీపీ శ్రేణులు ఆరోపించిన నేపథ్యంలో సోమవారం నాటి రామ్ ట్వీట్ దాదాపు ఎదురుదాడిలా పరిణమించింది. రమేశ్ ఆస్పత్రి వివాదంపై మాట్లాడబోనన్న ఆయన.. కొత్తగా కులం పేరుతో కామెంట్లు పెట్టడం ద్వారా తాను వెనక్కి తగ్గలేదని చెప్పకనే చెప్పినట్లయింది. అగ్నిప్రమాదంపై కామెంట్లతోపాటు మధ్యలో ప్రజా శ్రేయస్సు కోసమంటూ హీరో ఓ పోస్టు పెట్టారు. ‘‘RT - PCR టెస్టు చేయించుకున్నప్పుడు కుటుంబంలో 10 మందిలో 8 మందికి నెగటివ్ వచ్చినా సరే, CT SCANలో కోవిడ్ ఉన్నట్టు గమనిస్తే, వెంటనే వారిని ఆసుపత్రుల్లో చేర్పించండి. అలాంటి వారు సైలెంట్గా స్ప్రెడ్ చేయడంవల్ల ఇతరులు ప్రమాదంలో పడతారు''అని తెలిపారు. రామ్ తాజ ట్వీట్ ను బట్టి ఇకపైనా సామాజిక అంశాల కోణంలో ఆయన స్పందన కొనసాగుతుందని అర్థమవుతున్నది.
Recommended Video
చంద్రబాబు మద్దతుపై రామ్ సైలెన్స్..
విజయవాడ స్వర్ణప్యాలెస్ అగ్ని ప్రమాద దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తునకు ఎవరు అడ్డమొచ్చినా సహించబోమని, అవసరమైతే హీరో రామ్ పోతినేనికి నోటీసులు ఇస్తామంటూ విజయవాడ ఏసీపీ సూర్యచంద్రరావు వార్నింగ్ ఇచ్చినంతపనిచేశారు. రామ్ ను ఉద్దేశించి విజయవాడ ఏసీపీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ చీఫ్ చంద్రబాబు ఖండించారు. ఏసీపీ వ్యాఖ్యలు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని, ట్వీటు పెడితే నోటీసులనడం భావ్యం కాదని, ప్రశ్నించే గొంతును అణిచేయాలని జగన్ సర్కారు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కాగా, అడగకుండానే చంద్రబాబు మద్దతివ్వడంపై రామ్ పోతినేని వ్యూహాత్మ మౌనంవహించినట్లు తెలుస్తోంది. బాబు కామెంట్లపై హీరో స్పందించాల్సిఉంది.