సౌత్ కోసం సీబీఎన్ బ్లూప్రింట్.. కొత్త బుల్లెట్ ట్రైన్ ప్రపోజల్!
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివ కుమార్, కేరళ సీఎం సతీషన్, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు ఈ కీలక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్పించిన సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సమావేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రాంతీయ సహకారం, మౌలిక వసతుల విస్తరణ, నదీ జలాల సమర్థ నిర్వహణపై చంద్రబాబు విజన్ను కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ప్రశంసలతో ముంచెత్తారు. ఒక సీనియర్ రాజకీయ వేత్తగా కేవలం సొంత రాష్ట్రానికే పరిమితం కాకుండా, మొత్తం దక్షిణాది ప్రాంతాన్నంతా ఒక ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను ఆయన సదస్సు ముందుంచారు.
అమరావతి-బెంగళూరు-చెన్నై బుల్లెట్ కారిడార్!
దక్షిణాదిలో రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. ముఖ్యంగా అమరావతి, బెంగళూరు, చెన్నై నగరాలను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ఈ హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని సూచించారు.

దీంతో పాటు దక్షిణాది వ్యాప్తంగా సమర్థవంతమైన లాజిస్టిక్స్ నెట్వర్క్, డ్రై పోర్టుల ఏర్పాటు, విద్యుత్ గ్రిడ్ను జాతీయ గ్రిడ్తో మరింత పటిష్టంగా అనుసంధానించాలని స్పష్టం చేశారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు ఒకదానికొకటి తక్షణమే సహకరించుకునేలా 'మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్' ఏర్పాటుతో పాటు, తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ను అభివృద్ధి చేయాలని కోరారు.
2047 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తి!
దేశ జీడీపీలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల వాటా 31 శాతంగా ఉందని గుర్తుచేసిన చంద్రబాబు, కేంద్రం-రాష్ట్రాల మధ్య విశ్వాసం, సహకారం పెరిగితే 'వికసిత్ భారత్ 2047' లక్ష్యంలో దక్షిణాది పాత్ర అత్యంత కీలకమవుతుందన్నారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ ఏకంగా 10 ట్రిలియన్ డాలర్లకు చేరే సత్తా ఉందని వెల్లడించారు. ఈ దిశగా దక్షిణాదిలోని ప్రముఖ యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని కోరారు.
అదే సమయంలో, ఏపీ విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా షెడ్యూల్ 9, 10లలోని సంస్థల విభజన ఇంకా పూర్తికాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి చట్టబద్ధ రాజధాని, పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్లకు కేంద్రం ఇస్తున్న సహకారాన్ని కొనియాడుతూనే.. విశాఖ, విజయవాడ మెట్రోలు, దుగ్గరాజుపట్నం పోర్టు, కడప జేఎస్డబ్ల్యూ రైల్వే లింక్ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గోదావరి-కావేరి అనుసంధానంతో శాశ్వత పరిష్కారం!
దక్షిణాది రాష్ట్రాల మధ్య తరచూ వివాదాలకు కారణమవుతున్న నదీ జలాల అంశంపై చంద్రబాబు ఒక చారిత్రాత్మక పరిష్కారాన్ని ముందుకు తెచ్చారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించవచ్చని, ఇది తమిళనాడు తాగు, సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని వ్యాఖ్యానించారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రాజకీయాలకు అతీతంగా సమన్వయంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు అవసరాల కోసం గంగా-కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళికను రూపొందించాలని, సమయపరిమితితో కూడిన డీపీఆర్లు, పర్యావరణ అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. చంద్రబాబు చూపిన ఈ విశాల దృక్పథం, సమగ్రాభివృద్ధి విజన్ సదస్సులో పాల్గొన్న నాయకులందరినీ విశేషంగా ఆకట్టుకుంది.














Click it and Unblock the Notifications