లోకేష్ అదేం లేదంటే..! అమిత్ షా మాత్రం చర్చలంటున్నారు..
న్యూఢిల్లీ : మిత్రపక్షాల మధ్య రాజ్యసభ సీట్ల సర్దుబాటు రసవత్తరంగా మారుతోంది. ఇరుపక్ష నేతల భిన్నాభిప్రాయాలు చూస్తోంటే, ఈ విషయంలో ఏకాభిప్రాయంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. రాజ్యసభ సీటు ప్రతిపాదనను టీడీపీ ముందుంచామని బీజేపీ చెప్తుంటే, అసలు ఆ విషయంపై ఇంతవరకు బీజేపీ తమని సంప్రదించలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
శుక్రవారం ఉదయం ఈ విషయమై మీడియాతో మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్యసభ సీటు గురించి టీడీపీ సంప్రదింపులు జరుపుతున్నాయని ప్రకటించడం చర్చలకు తావిచ్చింది. రాజ్యసభ సీట్ల సర్ధుబాటు కోసం ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని ప్రకటించారు అమిత్ షా. అలాగే ఏపీ బీజేపీ శాఖకు వచ్చే వారంలోగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని తెలిపారు.
ఇదిలా ఉంటే మహానాడుకు బయలుదేరే రెండు రోజుల ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడిన లోకేష్ రాజ్యసభ సీట్ల విషయమై బీజేపీ ఇప్పటిదాకా తమని సంప్రదించలేదని ప్రకటన చేయడం గమనార్హం.