మనం మరిన్ని ఎంపీ సీట్లు గెలవాలి...చంద్రబాబుకు 30 లోపే అసెంబ్లీ సీట్లు రావాలి: అమిత్ షా దిశానిర్దేశం
న్యూఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ లో గతంలో కంటే ఎక్కువ లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని, అందుకు తగినవిధంగా వ్యూహరచన చేయడంతో పాటు పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని ఏపీ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దిశానిర్ధేశం చేశారు.
గత వ్యూహాలకు భిన్నంగా రాష్ట్రంలో ఉన్న 25 లోక్సభ నియోజకవర్గాలను 8 క్లస్టర్లుగా విభజించాలని బిజెపి అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలో ఒక్కో క్లస్టర్లో మూడు నియోజకవర్గాలు ఉండేలాగా, ఒక్కో క్లస్టర్కు రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతను ఇన్చార్జిగా నియమించాలంటూ అమిత్ షా ఈ ప్రణాళికను రాష్ట్ర బిజెపి నేతలకు వివరించారు.
సోమవారం ఢిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ ఎన్నికల కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, సోమూ వీర్రాజు, కంభంపాటి హరిబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, విష్ణుకుమార్రాజు, మాణిక్యాలరావు తమ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రామ్లాల్, రామ్మాధవ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వి.మురళీధరన్ కూడా పాల్గొన్నారు.
సమావేశం అనంతరం బిజెపి ఎమ్మెల్సీ సోమూ వీర్రాజు విలేకరులతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబును 30 సీట్లకు పరిమితం చేసే విధంగా బీజేపీ ప్రణాళిక ఉంటుందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు వైసీపీని, జనసేనను విమర్శించకుండా కేవలం ప్రధాని మోడీనే విమర్శిస్తున్నారని సోము వీర్రాజు ఆక్షేపించారు. ప్రధాని మోడీని విమర్శించడం చంద్రబాబు పరిపాటిగా మారిందన్నారు.
ప్రధాని మోడీ కన్నా తానే సీనియర్నని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని సోమూ వీర్రాజు విమర్శించారు. "గుజరాత్లో మోడీ ఏడుసార్లు బీజేపీని గెలిపించారు. 1999 ఎన్నికల్లో వాజ్పేయి దయమూలంగా, 2014 ఎన్నికల్లో బీజేపీ, పవన్ కల్యాణ్ దయతో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారు. సొంతంగా ఆయన ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాల్లేవు. మోడీకి, చంద్రబాబుకు పోలికా?...వీరిద్దరికీ నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది" అని సోము వీర్రాజు చంద్రబాబును దుయ్యబట్టారు.