తప్పంతా మీదే, ఎంతో చేశాం: చంద్రబాబుకు అమిత్ షా లేఖ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా లేఖ రాశారు. ఎన్డీఎ నుంచి వైదొలుగుతూ చంద్రబాబు రాసిన లేఖకు సమాధానంగా ఆయన శనివారం ఆ లేఖ రాశారు.
Recommended Video
చంద్రబాబుకు 9 పేజీల లేఖ రాశారు. ఆ లేఖలో అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధులతో పాటు కేంద్రం అమలు చేసిన హామీలను పొందుపరుస్తూ ఆయన ఈ లేఖ రాశారు. వైఫల్యమంతా చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఎత్తి చూపడానికి అమిత్ షా ఆ లేఖలో ప్రయత్నించారు.
అది ఆశ్చర్యం కలిగించింది..
తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలగడంపై అమిత్ షా చంద్రబాబుకు రాసిన లేఖలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్డీఎ నుంచి వైదొలగాలని చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కన్నా చంద్రబాబు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానిచారు.
ఆ విషయంపై వెనుకంజ వేయలేదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం అందించడంలో మోడీ ప్రభుత్వం ఎక్కడ కూడా వెనుకంజ వేయలేదని అమిత్ షా అన్నారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతో సహకరించారని ఆయన చెప్పారు. ఎపికి ఇచ్చిన హామీలను కేంద్రం పూర్తి స్థాయిలో నెరవేర్చిందని ఆయన అన్నారు ఎపి ప్రజలకు, టిడిపికి బిజెపి మంచి ఫ్రెండ్ అని ఆయన అన్నారు.
రాజధానికి వేయి కోట్లు ఇస్తే...
ఎపి రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం వేయి కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్రం కేవలం 12 శాతం ఖర్చు చేసి, 8 శాతానికి మాత్రమే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించిందన అమిత్ షా చెప్పారు. రాష్ట్రంలోని మూడు విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దామని చెప్పారు.
వివరాలతో అమిత్ షా లేఖ
2016-17లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో 12 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని అమిత్ షా అన్నారు. ఎపికి కేంద్రం ఇచ్చిన హామీలను, అమలు చేసిన హామీలను, కేంద్రం ఇచ్చిన నిధులను పొందపరుస్తూ అమిత్ షా చంద్రబాబుకు ఆ లేఖ రాశారు. కేంద్రం ఏం ఇచ్చింది, ఏం చేసింది అనే వివరాలన్నింటినీ ఆ లేఖలో ప్రస్తావించారు.