అమిత్ షా పొత్తు: చంద్రబాబును నొప్పించక, తానొవ్వక..
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ విస్తరణపై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా తానొవ్వక... చంద్రబాబును నొప్పించక అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. సొంత బలాన్ని గణనీయంగా పెంచుకుంటూనే తెలుగుదేశం పార్టీతో బెడిసికొట్టని రీతిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. తమ పార్టీలోకి వచ్చే కీలక నేతలందరినీ చేర్చుకునేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. విజయవాడలో ఆయన శుక్రవారం చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో బిజెపి బలపడడం అంటే, టిడిపిని బలహీనపరచడం కాదని అమిత్ షా శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధి కోసం తమ పార్టీ, టిడిపి కలిసి పనిచేస్తాయని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతాలు నచ్చి వచ్చేవారిని చేర్చుకుంటామని కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు పార్టీల నాయకులపై బిజెపి గురి పెట్టినట్లు కనిపిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు బిజెపిని విస్తరించడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన హానీ జరగకుండా తమ పార్టీ విస్తరిస్తుందని చెప్పడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రంలో టిడిపి, బిజెపి కూటమికి ప్రజలు మద్దతిచ్చారని, కేంద్రంలో బిజెపికి టిడిపి మద్దతిచ్చిందని తెలిపారు. భవిష్యత్లో ఈ బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. టిడిపి, బిజెపి కలిసి దేశవికాసం కోసం పనిచేస్తామని ఆయన చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కసరత్తు చేస్తోందని అమిత్ వెల్లడించారు.
అదే సమయంలో టిడిపిపై ఓ వ్యాఖ్య చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి చేరికను టిడిపి అడ్డుకుంటోందనే వాదనను ఖండిస్తూ ఆయన తమ పార్టీ నిర్ణయాన్ని టిడిపి ఎలా ప్రభావితం చేస్తుందని అన్నారు. మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డి పార్టీలో చేరికపై స్పందించిన అమిత్ బీజేపీ సిద్ధాంతాలు నచ్చినవారు ఎవరైనా పార్టీలోకి రావచ్చన్నారు. బిజెపిలో మాజీ సీఎం కిరణ్ చేరికను టీడీపీ అడ్డుకుంటుదన్న వాదనలో వాస్తవం లేదని తెలిపారు.
2019 ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలీయమైన శక్తిగా ఎదగాలనే వ్యూహంతో బిజెపి నాయకత్వం పనిచేస్తోంది. ఇప్పటికే బిజెపిలో ఆంధ్రప్రదేశ్లో ఇతర పార్టీల ముఖ్య నాయకులు చేరారు. మరింత మంది కూడా చేరుతారనే ప్రచారం జరుగుతోంది. మహారాష్ట్రలో శివసేన, బిజెపి కూటమి వ్యవహరించినట్లుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి - బిజెపి కూటమి ఉండాలనే యోచనలో అమిత్ షా ఉండవచ్చునని అంటున్నారు.