తెలుగు రాష్ట్రాలపై మోడీ పట్టు: టీ బీజేపీకి షా 'టార్గెట్', పవన్తో కలిసే
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు 20 లక్షల మెంబర్ షిప్ టార్గెట్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీలో మెంబర్ షిప్ ఉన్న వారు నాలుగు లక్షల మందికి పైగా ఉన్నారు. తెలంగాణకు మద్దతిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు తెరాస, కాంగ్రెస్లకు ధీటుగా ఎదిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మెంబర్ షిప్ టార్గెట్ ఇరవై లక్షలు పెట్టారు.
2019లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం లేదా కీలకంగా ఉండేలా ఎదగాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలు భావిస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు వస్తున్న అమిత్ షా ప్రధానంగా పార్టీని బలోపేతం చేసే విషయమై పలు సూచనలు చేయనున్నారు. మరోవైపు, ఇరు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో కలిసి వెళ్లాలని నేతలకు సూచించనున్నారని తెలుస్తోంది. తద్వారా 2019లోను పవన్తో కలుస్తారని అంటున్నారు.
బీజేపీలో చేరికకు పోటాపోటీ
దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమ పార్టీని అధికారంలోకి తెచ్చే వ్యూహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కమలాన్ని పటిష్టం చేసేందుకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా భారీ ప్రణాళికతో బుధవారం హైదరాబాద్ వస్తున్నారు. ఆయన రెండు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు.
ఈ సందర్భంగా పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరబోతున్నారు. కొత్తగా పార్టీ పట్ల ఆకర్షితులవుతున్న నేతలను చూసి పార్టీలో ఆశలు రేకెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా పార్టీని పటిష్టం చేసేందుకు అప్పటి పార్టీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ అనేక సూచనలు చేసినప్పటికీ అనుకున్నంతగా పార్టీ ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఎదగలేదని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై కొంతమంది ప్రముఖులతో రహస్య నివేదికలను రప్పించుకున్న ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా ఆ నివేదికల ఆధారంగా పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారని తెలిసింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఆంధ్రా అధ్యక్షుడిగా హరిబాబు వ్యవహరిస్తున్నారు. గత నెలలోనే తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించినా, అనుకున్నంత ఫలితాలు రావడం లేదనే భావన జాతీయ నాయకత్వంలో వ్యక్తమవుతోంది.
స్థానిక నేతలు కూడా జాతీయ నాయకత్వ ధోరణిపై కినుక వహిస్తున్నారు. తాజా సమగ్ర సమావేశాల్లో స్పష్టమైన అవగాహనతో పార్టీ రెండు రాష్ట్రాల నాయకత్వాలను మార్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఇప్పటికే ఒరిస్సాలో పర్యటిస్తున్న అమిత్ షా 7వ తేదీ రాత్రి 9.10కి హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్న అమిత్ షా విమానాశ్రయం నుండి నేరుగా పర్యాటక భవన్కు వెళ్తారు.
అక్కడే ఆయన విశ్రాంతి తీసుకుంటారు. 8వ తేదీ ఉదయం పర్యాటక భవన్లో పార్టీ పదాధికారులు, సీనియర్లతో సమావేశం అవుతారు. అనంతరం 11 గంటలకు సెస్ భవనంలో పార్టీ సభ్యత్వం విషయమై మరో సమావేశంలో పాల్గొని రాత్రి 7.20కి హైదరాబాద్లో బయలుదేరి రాత్రి 8.20కి విజయవాడ చేరుకుంటారు. 8వ తేదీ రాత్రి ఏపీ సీనియర్ నేతలతో సమావేశం అవుతారు. 9వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్ పార్టీ పదాధికారులతో సమావేశం అవుతారు.