ఫైనల్ గా ఇలా చేద్దాం..! సన్నిహితులతో ఆనం రామనారాయణరెడ్డి
అంతిమ నిర్ణయం తీసుకోవడానికి తన సన్నిహితులు, అనుచరులతో సమావేశమైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి
సీనియర్ రాజకీయవేత్త, ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండటంతోపాటు తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తి కూడా ఆయన్ను వెన్నాడుతోంది. ఆనం రోజురోజుకు విమర్శలను పెంచుకుంటూ పోతుండటంతో ప్రభుత్వం నియోజకవర్గానికి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించింది.
మనస్తాపానికి గురైన రామనారాయణరెడ్డి
అక్కడి నుంచి నియోజకవర్గంలో అధికారులు వీరిద్దరి మధ్య నలిగిపోతున్నారు. ఒకరు ఔనంటుంటే, మరొకరు కాదంటున్నారు. ఆనం దాదాపు పార్టీని వీడటం ఖాయమైంది. తాజాగా 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమానికి నేదురుమల్లిని ఇన్ఛార్జిగా నియమించింది. తనలాగే వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలను పిలిపించి మాట్లాడిన ముఖ్యమంత్రి తన విషయంలో అలా చేయకపోవడం రామనారాయణరెడ్డికి మనస్తాపాన్ని కలిగించింది. దీంతో పూర్తిస్థాయిలో పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చారు.
ఏ నియోజకవర్గం నుంచి పోటీచేద్దాం?
తాజాగా తన అనుయాయులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం.. ఎక్కడి నుంచి పోటీచేయడం.. అనుచరుల మద్దతు కూడగట్టడంలాంటి విషయాలన్నీ చర్చించారు.
నెల్లూరు సిటీ, ఆత్మకూరు ఈ రెండింటిలో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. వీటిపైనే ఆయన కూలంకుషంగా చర్చించారు. అలాగే నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నేతలు ఆనం రామనారాయణరెడ్డితో మాట్లాడుతున్నారు. ఆ పార్టీ నేతలంతా ఆనం రాకను స్వాగతిస్తున్నారు.
సానుకూలంగా ఉన్న తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఈ విషయంలో సానుకూల దృక్పథంతో ఉంది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లినప్పటికీ ఆయన లాంటి సీనియర్ నేత అవసరమని టీడీపీ భావిస్తోంది. దీనివల్ల ఆనంకు ఎటువంటి అడ్డంకులు ఎదురవడంలేదు. కాకపోతే పోటీచేసే నియోజకవర్గాన్నే ధ్రువీకరించుకోవాల్సి ఉంది.
ఒంగోలు మహానాడు సమయంలో చంద్రబాబు, లోకేష్ ను కలిసి ఆనం కుమార్తె వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి పోటీచేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. నెల్లూరు సిటీలో గట్టి పట్టుండటంతో ఇక్కడి నుంచి పోటీచేసినా విజయం తథ్యమనే భావనలో రామనారాయణరెడ్డి ఉన్నారు. టీడీపీ అధిష్టానం ఆయన్ని నెల్లూరు ఎంపీ సీటుకు పోటీచేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఏ విషయమైనా రామనారాయణరెడ్డి పార్టీ మారిన తర్వాతే స్పష్టత రానుంది.