టీడీపీ మోసం చేయలేదు కానీ: ఆనం రామనారాయణ ట్విస్ట్, వైసీపీలోకి వెళ్లడంపై..
నెల్లూరు: తన సోదరుడు ఆనం వివేకానంద రెడ్డి మృతితో తాము పెద్ద దిక్కు కోల్పోయామని మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆయన ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారా అని అడిగితే.. ఇప్పటికైతే టీడీపీ నుంచి వెళ్లిపోయినట్లు తాను చెప్పలేదన్నరు.
బాబుకు మళ్లీ షాక్, మొదటికొచ్చిన ఆనం వ్యవహారం: ఒక్కటైన ఫ్యామిలీ, టీడీపీ వీడాలని ఒత్తిడి
అలాగే టీడీపీ అధిష్టానం కూడా తనను తొలగించినట్లు చెప్పలేదన్నారు. తమ రాజకీయ నిర్ణయం ఆలస్యమైనా, నిర్ణయం తీసుకోవడం ఖాయమని చెప్పారు. 2019 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ చేయాల్సిందేనని ఆనం రామనారాయణ అన్నారు.
నిర్ణయం ఆలస్యమైంది కానీ తీసుకుంటాం
గత కొద్ది రోజులుగా తమ సోదరుడు ఆనం వివేకానంద మృతి బాధలో ఉన్నామని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆయన లేనిలోటు తమకు ఎవరూ తీర్చలేరన్నారు. ఈ కారణంగానే తీసుకునే నిర్ణయం ఆలస్యమైందని, కానీ నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని చెప్పారు.
టీడీపీ మోసం చేసిందని చెప్పలేదు కానీ
తమను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని తాము ఎప్పుడూ చెప్పలేదని ఆనం రామనారాయణ అన్నారు. తమ సోదరుడు ఆనం వివేకానంద కూడా ఎప్పుడూ అలా చెప్పలేదన్నారు. అయితే సరైన గుర్తింపు ఇవ్వలేదనే భావన మాత్రం తమలో ఉందని తేల్చి చెప్పారు.
వైసీపీలోకి వెళ్లడంపై
వైయస్సార్ పార్టీలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు కాలేదనే వార్తలపై ఆనం రామనారాయణ స్పందిస్తూ.. రాజకీయాల్లో మంచి రోజులు, చెడ్డ రోజులు ఉండవని చెప్పారు. అన్ని రోజులు మంచివే, అలాగే అన్ని రోజులూ చెడ్డవే అన్నారు. వివేకానంద రెడ్డి లోటును ఎవరు తీర్చుతారనే ఆసక్తి అందరి అభిమానుల్లో ఉందన్నారు. మేం అనని రకాలుగా సరైన నిర్ణయం తీసుకుంటామన్నారు.
రాజకీయాల్లో ఉన్నప్పుడు పోటీ చేయాలి
వచ్చే ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తానని ఆనం రామనారాయణ స్పష్టం చేశారు. అధికార పార్టీయా, ప్రతిపక్ష పార్టీయా అన్నది ముఖ్యం కాదని, రాజకీయాల్లో ఉన్నప్పుడు కచ్చితంగా పోటీ చేయాలన్నారు. తద్వారా ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో చెప్పకపోవడం ఆసక్తిని కలిగిస్తోంది. టీడీపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.