వైసీపీ వర్సస్ బీజేపీ మధ్యలో చంద్రబాబు -అన్నమయ్య "డామేజ్" భర్తీ ఎలా : పార్లమెంట్ వేదికగా..!!
భారీ వర్షాలు..వరదలతో కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో..ఊహించని విధంగా వచ్చిన వరదతో కడప జిల్లాలోని అన్నమయ్య, పింఛ కట్టల విధ్వంసంతో పెను నష్టాన్ని మిగిల్చింది. దీనికి భారీ వరదే కారణమని అధికార వర్గాల వాదిస్తున్నప్పటికీ.. రాజకీయంగానూ ఇప్పుడు ఇది చర్చకు కారణమైంది. పార్లమెంట్ వేదికగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా ఏపీ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. దీనికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమాధానం ఇచ్చారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలతో
తెలుగు దేశం నుంచి వచ్చిన నేతల సమాచారంతోనే కేంద్ర మంత్రి మాట్లాడారంటూ ఫైర్ అయ్యారు. అదే సమయంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాఖండ్ లో వచ్చిన వరదల గురించి ప్రస్తావించారు. కేంద్ర మంత్రి ఏపీ ప్రభుత్వం ..అధికారుల నుంచి ఎటువంటి సమాచారం లేకుండా ఎలా మాట్లాడుతారని మంత్రి అనిల్ నిలదీసారు. దీని పైన బీజేపీ ఎంపీలు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. జరిగిన తప్పు గురించి ఆలోచన చేయకుండా కేంద్ర మంత్రిని తప్పు బట్టటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేంద్రాన్ని తప్పు బడితే ఇబ్బందులు తప్పవంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యానించారు.
మంత్రి అనిల్ కౌంటర్
పార్లమెంట్ వేదికగా ప్రాజెక్టు నిర్వహణలో లోపాలు ఉన్నాయంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వానికి సవాల్ గా మారుతున్నాయి. దీంతో...అసలు ఏ రోజు ఏం జరిగిందనేది వివరంగా ప్రజల ముందు ఉంచాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి.
ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన. కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
అనేక ప్రశ్నలు..సందేహాలు
సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత చంద్రబాబు సైతం ప్రస్తావిస్తున్నారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి.
చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడంతో, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాజెక్టులకు ప్రమాదం సంభవించింది. మూడు రోజులు అతి భారీవర్షాలు కురిశాయని ప్రభుత్వమే చెబుతోంది. అన్నమయ్య జలాశయానికి పైన బాహుదా, పింఛ, మాండవ్య మీదుగా నీటి ప్రవాహాలుంటాయి. ఆ మూడు కలిసిన చెయ్యేరు మీదే అన్నమయ్య జలాశయం ఉంది.
ప్రభుత్వం పై చంద్రబాబు విమర్శలు
అతి భారీవర్షాల వల్ల వరద వస్తుందని ఇంజినీరింగు అధికారులు అంచనా వేయగలరు. ఆ పరీవాహకంలో ఎక్కడ ఎంత వర్షం పడిందో లెక్కలూ అందుబాటులో ఉంటాయి. భారీవర్షాలు ప్రారంభమైన మూడోరోజు అర్ధరాత్రి తర్వాత రెండు జలాశయాల కట్టలు తెగాయి. అన్నమయ్య జలాశయంలో నిల్వ ఉన్న 1.590 టీఎంసీల నీటిని ముందే ఖాళీ చేసి వరద నీటిని నింపేందుకు సిద్ధంగా ఉండాల్పి ఉండగా.. అలా ఎందుకు చేయలేదనే ప్రశ్న వినిపిస్తోంది.అన్నమయ్య జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో, గేట్లు ఎత్తే విషయంలో జలవనరులశాఖ అధికారులకు.. రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం కనిపించిందనేది మరో ప్రధాన విమర్శ.
Recommended Video
ప్రభుత్వం స్పష్టత ఇచ్చేనా
అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు గతేడాది నవంబరులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నమయ్యలో అయిదో గేటు పని చేయట్లేదు. మరమ్మతు పనుల కోసం రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా, నిధులు మంజూరు కాలేదు. అప్పుడు దెబ్బతిన్న ప్రాజెక్టు మరమ్మతులకు రూ.4 కోట్లు కూడా ఇవ్వలేరా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం పైన ఏపీ ప్రభుత్వం ఏరకంగా సమాధానం చెబుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది. దీని పైన వైసీపీ ఎంపీలే ఢిల్లీ కేంద్రంగా సమాధానం ఇస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు.