చంద్రబాబు దగ్గర 'సరే'.. అన్నారు.. ఇంటికెళ్లి మళ్లీ అదేపని చేస్తున్నారు??
వచ్చే ఎన్నికలు ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకమో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అంతే ప్రతిష్టాత్మకం. వరుసగా రెండోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ భావిస్తుండగా, ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పార్టీని పూర్తిగా బలోపేతం చేయడంతోపాటు అభ్యర్థులను కూడా ముందుగానే ఖరారు చేసుకుంటూ వస్తోంది.

అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తున్న చంద్రబాబు
చంద్రబాబునాయుడు తన స్వభావానికి విరుద్ధంగా చాలా ముందుగానే నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా 40 శాతం యువతకే టికెట్లు కేటాయిస్తానన్నారు. ఇదే క్రమంలో తనకు కంచుకోటలుగా నిలిచిన జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. వాటిల్లో రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లా ఒకటి. 2014 ఎన్నికల్లో మంచి సీట్లు సాధించినప్పటికీ జగన్ గాలిలో 2019 ఎన్నికల్లో ఈ జిల్లాలో టీడీపీ పూర్తిగా విఫలమైంది. 2024 ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 సీట్లను క్లీన్ స్వీప్ చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.

ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు
పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీకి కంచుకోట లాంటి కల్యాణ దుర్గం నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తాను ఒకవైపు కష్టపడుతుంటే నియోజకవర్గాల్లోగ్రూపు విభేదాలతో తమ్ముళ్లు పార్టీ పరువును బజారుకీడుస్తున్నరాని, గెలవడానికి ఉన్న అవకాశాలను పోగొడుతున్నారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్యం కోసం పార్టీని నాశనం చేస్తున్నారని, వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకోవాల్సిందిపోయి అంతర్గత కలహాలతో మీలోమీరే తన్నుకుంటున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పార్టీని బలోపేతం చేస్తున్న ఉమామహేశ్వరనాయుడు
కల్యాణదుర్గంలో ఉమామహేశ్వరనాయుడుకు గత ఎన్నికల్లో చంద్రబాబు సీటిచ్చారు. అయితే అదే సీటును సీనియర్ నేత హనుమంతరాయచౌదరి ఆశించారు. తర్వాత నాయుడు ఓటమి పాలయ్యారు. అక్కడి నుంచి గెలుపొందిన ఉషాశ్రీచరణ్ మంత్రిగా ఉన్నారు. అయితే నియోజకవర్గంలో మంత్రిపై పెరుగుతున్న వ్యతిరేకను తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీడీపీ నేతలు పూర్తిగా విఫలమవుతున్నారు. నాయుడు ఓటమి పాలైనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారించారు.

వర్గాన్ని ఏర్పాటు చేసి రాజకీయం చేస్తున్న హనుమంతరాయచౌదరి
తాను తెప్పించుకున్న సర్వే ప్రకారం హనుమంతరాయచౌదరి ప్రత్యేకంగా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని రాజకీయం చేస్తున్నరాని, నాయుడుకు చెక్ పెట్టడం కోసం పనిచేస్తే సహించేది లేదని చంద్రబాబు హెచ్చరికలు జారీచేశారు. నాయుడు ఆధ్వర్యంలోనే పనిచేయాలని శ్రేణులకు సూచించారు. అయితే బాబు దగ్గర సరే అని చెప్పి కల్యాణ దుర్గం వచ్చిన తర్వాత మళ్లీ హనుమంతరాయ చౌదరి గ్రూపు రాజకీయం చేయడం ప్రారంభించారు. నాయుడువైపు ఉండాలో? చౌదరివైపు ఉండాలో? అర్థం కాక పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. వీరు ఇలాగే కలహించుకుంటూ పోతే రానున్న ఎన్నికల్లోకూడా ఇక్కడి నుంచి టీడీపీ ఓటమిపాలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications