హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం- ఏపీలో ఆ జిల్లాల్లో కుండపోత: ఇంకో 48 గంటల్లో
అమరావతి: నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, గుంటూరు సహా పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదైంది. మరో 48 గంటల పాటు ఆయా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్లో ఈ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మేఘాలు దట్టంగా అలముకున్నాయి. ఉన్నట్టుండి భారీ వర్షం పడింది. ఒక్కసారిగా భారీ వర్షం కురువడంతో పలు ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. గంటల తరబడి వాహానదారులు రోడ్లపైనే గడపాల్సి వచ్చింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

భారీ వర్షాల ధాటికి జంటనగరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇమ్లీబన్, చాంద్రాయణగుట్ట, గోల్కొండ, అత్తాపూర్, బహదూర్ పురా, మెహదీపట్నం, షేక్పేట్, టోలీచౌకి, ఆర్సీ పురం, ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, రాయదుర్గం, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, నాంపల్లిల్లో భారీ వర్షం పడింది. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రజలు అంధకారంలో గడిపారు.
భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురుస్తాయంటూ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదాలు సంభవించకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోన్నారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదైంది. జోగులాంబ గద్వాల, నాగర్కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఓ మోస్తరుగా వర్షం పడింది.

ఏపీలో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. విజయవాడ, గుంటూరు, ప్రకాశం, కావలి, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, కడప జిల్లాల్లోనూ చెదురు మదురు నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. తిరుమలలో కుండపోత వర్షానికి భక్తులు ఇబ్బందులు పడ్డారు. బలమైన ఈదురుగాలులు దీనికి తోడయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో- విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, విజయనగరంలల్లో చెదరుమదురు వర్షాలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications