అమరావతిలో లక్ష కోట్ల సంపద: రాజధాని రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు: చలసాని శ్రీనివాస్..!
గుంటూరు: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలను కొనసాగిస్తోన్న అమరావతి ప్రాంత రైతులకు ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళన 13వ రోజుకు చేరుకోవడం, ఆరుమంది రైతులు అరెస్టు కావడం, రోజురోజుకూ ఉధృతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో చలసాని శ్రీనివాస్.. వారికి తన మద్దతును ప్రకటించారు. స్వయంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజధాని ప్రాంతంలోని పెదపరిమిలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో ఆయన బైఠాయించారు.
లక్ష కోట్లకు పైగా సంపద..!
అమరావతిలో గత ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా సంపదను సృష్టించిందని, దాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్లాలనుకోవడం మూర్ఖత్వమని చలసాని శ్రీనివాస్ విమర్శించారు. అభివృద్ధిని వికేంద్రీకరించాలే తప్ప పరిపాలనను కాదనే విషయాన్ని తాను ముందు నుంచీ చెబుతూనే వస్తున్నానని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయపరమైన రాజధానిగా మార్చాలనుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగమూ ఉండబోదని చెప్పారు.
జీఎన్ రావు కమిటీ రద్దుకు డిమాండ్..
మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటూ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య రాజధాని పరిసర గ్రామాలకు సంబంధించినది మాత్రమే కాదని, రాష్ట్ర సమస్యగా ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. అమరావతి ప్రాంత రైతులు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, ప్రభుత్వం వారిని రోడ్డెక్కలా చేసిందని విమర్శించారు.
అమరావతి రైతులు ఏం కావాలి..?
రాత్రికి రాత్రి అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామంటే ఇక్కడి రైతులు ఏం కావాలని చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. రైతులను అనాథలుగా మార్చేస్తారా? అని నిలదీశారు. రైతులను రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం సృష్టించిన సంపదను రాష్ట్రం మొత్తానికీ పంచేలా ప్రణాళికలను రూపొందించుకోవడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అమరావతి ప్రాంత రైతులకు అన్యాయం జరుగుతోంటే చూస్తూ ఉండలేమని ఆయన స్పష్టం చేశారు.