అనంతపురం జిల్లా కంప్లీట్ లాక్డౌన్: ఆ ఆరు గంటలు కూడా క్లోజ్
అనంతపురం: కరనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ ఉధృతమౌతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు. దుకాణాలను తెరవడానికి, వాహనాల రాకపోకల కోసం ఇదివరకు అమల్లో ఉన్న ఆరు గంటల మినహాయింపును కూడా రద్దు చేశారు. తెల్లవారు జాము నుంచి జిల్లావ్యాప్తంగా కంప్లీట్ లాక్డౌన్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించడానికి పాక్షికంగా అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత ఆర్టీసీ బస్సులు కూడా రాకపోకలు సాగించడానికి అనుమతి లేదు.
అనంతపురం జిల్లా అధికారులు శనివారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. జిల్లాలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 2,975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల్లో రెండో స్థానంలో నిలిచింది. తూర్పు గోదావరి జిల్లాలో 3,383 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఒక్కరోజే అనంతపురం జిల్లాలో 12 కరోనా కాటుకు బలి అయ్యారు. మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే మృతుల సంఖ్య ఈ జిల్లాలోనే అధికం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అనంతపురం జిల్లావ్యాప్తంగా సంపూర్ణ లాక్డౌన్ విధించారు.

సాధారణంగా ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలను తెరవచుకోవడానికి, వాహనాల రాకపోకలకు ఉన్న అనుమతిని కూడా రద్దు చేశారు. ఈ రోజంతా కంప్లీట్ లాక్డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. సోమవారం యధాతథంగా తెల్లవారు జామున 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. తాడిపత్రి, పుట్టపర్తి, రాయదుర్గం, మడకశిర, హిందూపురం, గుంతకల్లు, గుత్తి వంటి చోట్ల ఇదివరకే ఆదివారాల్లో సంపూర్ణ లాక్డౌన్ అమల్లో ఉంటోంది. దీన్ని మరింత విస్తరించి.. జిల్లా మొత్తానికీ అమలు చేశారు.
Recommended Video
అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్ను దాటేసింది. 1,10,861 కేసులక్కడ నమోదయ్యాయి. ఇందులో 94,240 మంది డిశ్చార్జ్ అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు 15,852గా నమోదైంది. ఈ జిల్లాలో ఇప్పటిదాకా 769 మంది కరోనా బారిన పడి కన్నుమూశారు.












Click it and Unblock the Notifications