పార్టీ ఇంచార్జీలకు నిధులా: జగన్, దద్ధరిల్లిన ఎపి అసెంబ్లీ
హైదరాబాద్: స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డిఎఫ్)పై బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ దద్ధరిల్లింది. ఎస్డిఎఫ్ పేరుతో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ ఇంచార్జీలకు నిధులు కేటాయించారని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఎమ్మెల్యేలకు ఇవ్వకుండా టిడిపి నేతలకు నిధులు విడుదల చేస్తూ జీవోలు జారీ చేశారని ఆయన చెప్పారు. టిడిపి నేతలు కందుల నారాయణ రెడ్డి, ఆదాల ప్రభాకర రెడ్డి పేర్లతో ప్రభుత్వం ఎస్డిఎఫ్ నిధులు కేటాయించిన విషయాన్ని ఆయన సభ దృష్టికి తెచ్చారు.
ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్తితి నెలకొంది. అయితే, ఎస్డిఎఫ్ నిధులను ఎమ్మెల్యేలు కానివారికి కేటాయించిన మాట వాస్తవమేనని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకరించారు. తాము జీవోలు విడుదల చేశామని, అది అందరికీ తెలుసునని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి తన వద్దకు వచ్చినవారికి నిధులు మంజూరు చేశారని, ఇది కొత్త పద్ధతేమీ కాదని, గతంలో కూడా ఉందని, దాని ప్రకారమే నడుచుకున్నామని ఆయన చెప్పారు. ఈ వ్యవహారంపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది.