ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్: మూడు రాజధానులపై తేల్చుడే: టీడీపీపైనే ఫోకస్
అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముహూర్తం కుదిరింది. కరోనా వైరస్ ప్రొటోకాల్స్ మధ్య ఈ సమావేశాలు ఆరంభమౌతాయి. ఆరు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. దీన్ని పొడిగించడమా? లేక కుదించడమా? అనేది త్వరలోనే నిర్ధారిస్తారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కొన్ని కీలక బిల్లులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సభలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉందని అంటున్నారు. మూడు రాజధానులపైనా కీలక నిర్ణయాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
17వ తేదీ నుంచి..
నవంబర్ 17వ తేదీన అసెంబ్లీ శీతాకాల సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ఉదయం- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. నాలుగు నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రులు ప్రతిపాదించగా.. ముఖ్యమంత్రి- ఆరు రోజుల పాటు కొనసాగించడానికి మొగ్గు చూపారని సమాచారం.
మూడు రాజధానులపై..
ప్రత్యేకించి- రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన బిల్లుపై ఈ సమావేశాల్లో అధికార పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకుంటుందని చెబుతున్నారు. చట్టసభల రాజధానిగా అమరావతిని కొనసాగిస్తూనే- పరిపాలన రాజధానిగా ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, న్యాయ రాజధానిగా రాయలసీమలోని కర్నూలును తీర్చిదిద్దే విషయంలో ఇక ఎంత మాత్రం కూడా జాప్యం చేయకూడదని మంత్రివర్గం తీర్మానించినట్లు తెలుస్తోంది. 2021 జనాభా లెక్కింపులో వెనుకబడిన తరగతుల వారిని కులాల ప్రాతిపదికన గణించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది అధికార పార్టీ.
ఇక వేగవంతం..
మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారంలో ఇప్పటికే తీవ్ర జాప్యం ఏర్పడినందున.. ఇక దీన్ని వేగవంతం చేయడమే మేలని అన్ని ప్రాంతాలకు చెందిన మంత్రులు అభిప్రాయపడగా.. వైఎస్ జగన్ వారితో ఏకీభవించినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఎలాంటి అడ్డంకులనైనా అధిగమించడానికి, ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న భవనాల్లో పరిపాలన కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారని అంటున్నారు.
బడ్జెట్ సెషన్స్ బాయ్కాట్..
ఇదిలావుండగా- ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైఖరి ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదివరకు ఆ పార్టీ శాసనసభ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు మితిమీరాయని ఆరోపిస్తూ ఇదివరకు టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహష్కరిస్తూ తీర్మానం చేసింది. తమ పార్టీ నేతలపైనే కాకుండా, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించింది టీడీపీ.
టీడీపీపై ఫోకస్..
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఉప నేత అచ్చెన్నాయుడు సహా ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇదివరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాలేదు. అప్పట్లో మాక్ అసెంబ్లీని నిర్వహించారు. ఈ సారి ఆ పార్టీ వైఖరి ఏమిటనేది చర్చనీయాంశమౌతోంది. తన వైఖరిని శీతాకాల సమావేశాల కోసం కూడా కొనసాగిస్తుందా? లేక సభకు హాజరవుతుందా? అనేది హాట్ టాపిక్గా మారింది. శీతాకాల సమావేశాలకు టీడీపీ హాజరు కావడానికే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
కేబినెట్లో తీసుకున్న ఇతర నిర్ణయాలివే..
మంత్రివర్గంలో తీసుకున్న ఇతర నిర్ణయాల విషయానికి వస్తే- రైతులకు 9 గంటల పగటిపూట ఉచిత విద్యుత్ అందించడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఆమోదం లభించింది. యూనిట్కు రూ.2.49 పైసల చొప్పున ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. సినిమాటోగ్రఫీ చట్టసవరణ ప్రతిపాదలకు కూడా మంత్రివర్గం ఆమోదించింది.
అగ్రవర్ణాల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ..
అగ్రవర్ణాల సంక్షేమానికి ప్రత్యేకంగా ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్తగా జైన్ కార్పొరేషన్, సిక్కుల కార్పొరేషన్ ఏర్పాటుకు కూడా ఆమోదం లభించింది. వైద్య, ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ, రాష్ట్రంలో అయిదు చోట్ల సెవన్ స్టార్ పర్యాటక రిసార్ట్ల ఏర్పాటు కోసం భూముల కేటాయింపునకు ఆమోదం తెలిపింది కేబినెట్.
శారదా పీఠానికి
విశాఖపట్నంలోని శ్రీశారదా పీఠానికి కొత్త వలసలో 15 ఎకరాలను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. అలాగే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) శిల్పారామాల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలో తాజ్ వరుణ్ బీచ్ ప్రాజెక్టును ఆమోదించింది. జయలక్ష్మీ నరసింహ శాస్త్రి గుండ్లూరు ట్రస్ట్కు అనంతపురం జిల్లా బొమ్మేపర్తిలో 17.49 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించింది.