ఎపి అసెంబ్లీ: జగన్ అనుభవరాహిత్యమా, వ్యూహాత్మక తప్పిదమా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టడానికి పనికి వచ్చే అస్త్రాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి, బోగాపురం విమానాశ్రయానికి భూసేకరణ అంశం ఓ వైపు ఉండగా, తాజాగా కల్తీ మద్యం, కాల్ మనీ వ్యవహారాలు ప్రతిపక్ష పార్టీ నేతగా వైయస్ జగన్‌కు అంది వచ్చాయి.

కానీ, శాసనసభలో ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసి, రాజకీయంగా పైచేయి సాధించడానికి అవసరమైన రీతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరించలేకపోయిందనే మాట వినిపిస్తోంది. అనుభవరాహిత్యం ఆయనను పట్టి పీడిస్తున్నట్లు కనిపిస్తోంది. శాసనసభ్యుల్లో తగిన సలహాలు ఇచ్చేవారు కూడా లేనట్లు కనిపిస్తున్నారు. జ్యోతుల నెహ్రూ వంటివారు ఉన్నారని అనిపిస్తున్నప్పటికీ జగన్ ఎవరి సలహాలనైనా వింటారా అనేది కూడా సందేహంగానే ఉంది.

కాల్ మనీ వ్యవహారంపై చర్చలో జగన్ అధికార పక్షాన్ని లక్ష్యం చేసుకుని సూటిగా అస్త్రాన్ని సంధించడంలో విఫలమైనట్లే కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన తర్వాత చర్చకు అవకాశం ఇస్తామని, సందేహాలు అడగడానికి మాత్రమే పరిమితం కాదని ఓ వైపు శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, మరో వైపు స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెబుతున్నా వినకుండా రూల్ పొజిషన్ చెబుతూ పదే పదే చర్చకు అవకాశం ఉండదనే మాటను జగన్ వినిపిస్తూ వెళ్లారు.

Andhra Pradesh assembly: YS jagan lacks experience?

నిజానికి, శాసనసభలో స్పీకర్ మాటనే చెల్లుబాటు అవుతుంది. సర్వాధికారాలు స్పీకర్‌కు ఉంటాయి. ఆ విషయం తెలిసి ఉంటే కాల్ మనీ వ్యవహారంలో సమయాన్ని వృధా చేసి చర్చ దగ్గరికి వచ్చేసరికి ప్రసంగాన్ని డ్వాక్రా మహిళల రుణాలవైపు, రైతు రుణాల మాఫీ వైపు తీసుకుని వెళ్లి మంత్రులు, అధికార పార్టీ సభ్యులు చెప్పే వివరణలతో ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు.

అనుభవరాహిత్యం వల్ల జగన్ అలా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదే పదే గుర్తు చేశారు. అయినా ఆ మాటలు ఆయనకు పట్టలేదు. జగన్ మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు సార్లు చంద్రబాబు నవ్వారు కూడా. చంద్రబాబు నవ్వును సరిగా అర్థం చేసుకుని వుంటే ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏంత పేలవంగా వ్యవహరించిందో అర్థమై ఉండేది.

ఇంకో విషయం - స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదటి సారి చేస్తున్న విమర్శ ఏమీ కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ అసెంబ్లీలోనూ ప్రతిపక్షాలు ఆ విమర్శలు చేసిన సందర్భాలున్నాయి. స్పీకర్ అధికార పార్టీకి చెందినవారై ఉంటారు కాబట్టి ఆ పక్షపాత ధోరణి ఉంటుందనే సాధారణ అభిప్రాయం కూడా ఉంది. ఇటువంటి స్థితిలో స్పీకర్‌పైనే పూర్తిగా బాణాలు ఎక్కుపెట్టడం కూడా జగన్ చేసిన తప్పుల్లో మరోటి.

స్పీకర్ పక్షపాత వైఖరిని ఎత్తిచూపుతూనే అధికార పక్షాన్ని లక్ష్యం చేసుకుని సూటిగా విమర్శలను సంధించాల్సి ఉంటుంది. మరోవిషయం ఏమిటంటే, శాసనసభలో సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం, అనరాని మాటలు అనడం కూడా కొత్తేమీ కాదు. కానీ, అది శ్రుతిమించిపోయినట్లు కనపించింది. అయితే, వాదనలు, దూషణల విషయంలో ప్రతిపక్షం పట్టువిడుపులు ప్రదర్శించాల్సి ఉంటుంది.

Andhra Pradesh assembly: YS jagan lacks experience?

తమ సభ్యులు పరుషంగా మాట్లాడినప్పుడు, అనుచితమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ సభ్యులు స్వయంగా విచారం వ్యక్తం చేయడం, లేదంటే వారి తరఫున ప్రతిపక్ష నేత విచారం వ్యక్తం చేయడం వంటి సంప్రదాయాలను పాటిస్తుంటారు. అలా పాటించినప్పుడు అవి పక్కకు వెళ్లి చర్చ ముందుకు సాగుతుంది. ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు సాగినప్పుడు సమస్య తీవ్రమైంది అయినప్పుడు సభా కార్యక్రమాలను స్తంభింపజేయడం కూడా ఉంది. కానీ, అదే పనిగా పెట్టుకున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కనిపించింది. ఇది వ్యూహాత్మక తప్పిదమైనా కావచ్చు, అనుభవ రాహిత్యమైన కావచ్చు.

అధికార పక్షం సభ్యుల నుంచి గానీ మంత్రుల నుంచి గానీ తమ వైపు పరుషుమైన, అనుచితమైన వ్యాఖ్యలు వచ్చి ఉండవచ్చు. అటువంటి సమయంలో ప్రతిపక్ష నేతగా జోక్యం చేసుకుని వాటిని ఎత్తిచూపితే వారు సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షం ఒక పద్ధతిలో వ్యవహరించినప్పుడు అధికార పక్షం నుంచి జరిగే తప్పిదాలను ఎత్తి చూపడానికి, వెనక్కి తగ్గే విధంగా వారిని మలచడానికి వీలవుతుంది.

అధికార పక్షాన్ని కొంత అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ అవకాశాలను తీసుకుని వారు వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు చేయవచ్చు. అటువంటివి ఎదురైనప్పుడు ధీటైన ప్రతిపక్ష నాయకుడైతే తిప్పికొట్టే అవకాశం ఉంటుంది. ఈ తిప్పికొట్టడమనేది దూషణలు, అనుచిత వ్యాఖ్యల రూపంలో ఉండకపోతే అధికార పక్షం ఇరకాటంలో పడుతుంది.

రోజా చేసిన వ్యాఖ్యల విషయంలో గానీ, ఆమె అనుసరించిన తీరుపై గానీ జగన్ వ్యూహం మరో విధంగా ఉండాల్సింది. నిజంగానే ఆమె ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే, వాటిని వెనక్కి తీసుకుని, క్షమాపణ చెప్పి ఉంటే హుందా ఉండి ఉండేది. కాల్ మనీ వ్యవహారం అనేది తీవ్రమైన విషయమే. అధికార పక్షం దాన్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. కానీ ఆ సయమంలో ఆవేశాన్నీ, ఆగ్రహాన్ని అదుపు చేసుకుని సరైన రీతిలో అధికార పక్షాన్ని తిప్పికొట్టే అవకాశాన్ని జగన్ చేజార్చుకున్నారనే అనిపిస్తోంది.

సభలో అధికార పక్షం ప్రతిపక్షంపై ఆధిక్యత ప్రదర్శించాలని చూడడం కొత్త విషయమేమీ కాదు. అలాగే ప్రతిపక్షం అధికార పక్షాన్ని చిక్కుల్లో పడేయాలని చూడడం సహజం. ఈ సందర్భంలో ఏ పక్షం ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించిందనేదే లెక్కలోకి వస్తుంది.

రాజకీయాల్లో పట్టువిడుపులు ప్రదర్శించక తప్పదు. అదే సయమంలో చేసిన తప్పులను అంగీకరించడం కూడా నాయకత్వ లక్షణానికి, పరిపక్వతకు నిదర్శనంగా నిలుస్తాయి. బాక్సైట్ తవ్వకాలపై సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి చేసిన వ్యాఖ్య కూడా అటువంటిదే. ఆవేశంలో ఆమె చంద్రబాబుపై ఆ వ్యాఖ్య చేసి ఉండవచ్చు. కానీ దాన్ని వెనక్కి తీసుకుని ఉంటే హుందా ఉండి ఉండేది. అలా వెనక్కి తీసుకున్న తర్వాత కూడా అధికార పక్షం వేధింపులకు దిగితే అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా మారి ఉండేది.

రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యక్తిగత స్థాయికి చేరుకుంటున్నాయని ప్రస్తుత పరిస్థితిని చూస్తే అనిపిస్తోంది. వ్యక్తిగతంగా కోపతాపాలు ఉండవచ్చు. కానీ అవి వెనక్కి వెళ్లి రాజకీయాలది పైచేయి కావాల్సి ఉంటుంది.

దానికితోడు, సమావేశాలను ప్రతిపక్షం బహిష్కరించడం వల్ల చివరి రోజు అధికార పక్షం వేదికను తనకు అనకూలంగా వాడుకుంది. రోజా వ్యాఖ్యలపై, ప్రవర్తనపై చర్చ పెట్టి, దళిత మహిళల చేత మాట్లాడించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీపై ఆధిక్యతను ప్రదర్శించింది. ఏమైనా, జగన్ వ్యూహాత్మక తప్పిదం, అనుభవరాహిత్యం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి కలిసి వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+