15న కేబినెట్: మంత్రివర్గ విస్తరణ, రాజధానిగా విశాఖ, కొత్త జిల్లాల ఏర్పాటుకు గ్రీన్సిగ్నల్?
అమరావతి: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 15వ తేదీన సమావేశం కానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో గల సచివాలయంలో కేబినెట్ భేటీ కాబోతోంది. కరోనా వైరస్ విజృంభణ రోజుెరోజుకూ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలను కూడా తీసుకోలేకపోతోంది. సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఢోకా లేనప్పటికీ..అభివృద్ధికి సంబంధించినంత వరకూ ఎలాంటి అడుగు ముందుకు పడట్లేదు.

కీలక పరిణామాల మధ్య..
ఈ పరిణామాల మధ్య రాష్ట్ర కేబినెట్ భేటీ కాబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పలు కీలక అంశాలు ఈ సమావేశంలో చర్చకు రాబోతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని బదలాయించడం, కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవడం వంటి ప్రతిష్ఠాత్మక, కీలక అంశాలను మంత్రివర్గ సమావేశం అజెండాలో చేర్చినట్లు చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే అంశం చర్చకు రావచ్చని తెలుస్తోంది.

కేబినెట్లో రెండు బెర్తులు ఖాళీ..
ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్లో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖను పర్యవేక్షించిన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఇద్దరూ రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నిక కావడం వల్ల వారిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయడం అనివార్యమైంది. ఇక వారి స్థానాలను ప్రభుత్వం భర్తీ చేయాల్సి ఉంది. ఇప్పటికే రెండు పేర్లు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

ఆశావహుల పేర్లను ఖరారు..
కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ రెండుబెర్తులను భర్తీ చేసే అంశం, మంత్రివర్గంలోకి తీసుకోబోయే నేతల పేర్లను కేబినెట్ భేటీలో ఖాయం చేస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి మదిలో ఉన్న కొన్ని పేర్లను ఈ సందర్భంగా మంత్రివర్గంలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. అందరి మంత్రుల ఏకాభిప్రాయాన్ని తీసుకున్న తరువాతే ఆశాావహుల పేర్లను ఖరారు చేస్తారని చెబుతున్నారు.

సచివాలయం తరలింపుపై
విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయించాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నిర్ణయం. కరోనా వైరస్ వల్ల నెలకొన్న సంక్షోభ పరిస్థితులు లేకపోయి ఉంటే.. ఈ పాటికి సచివాలయం అమరావతి నుంచి విశాఖకు తరలివెళ్లి ఉండేదనేది జగమెరిగిన సత్యం. ఇప్పట్లో కరోనా ప్రభావం తగ్గే అవకాశాలు లేవు. ఎన్నిరోజులు పడుతుంద కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లో సచివాలయం తరలింపును ఆపేయడం మంచిదికాదని వైఎస్ జగన్ అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

ముహూర్తం ఖాయం చేసే ఛాన్స్?
ఈ పరిస్థితుల్లో విశాఖపట్నానికిక తరలి వెళ్లే అంశం కూడా ఈ సందర్భంగా కేబినెట్లో చర్చకు రావచ్చని తెలుస్తోంది. అక్టోబర్లో విజయదశమి నాటికి విశాఖ నుంచి ముఖ్యమంత్రి పరిపాలన సాగించే అవకాశం లేకపోలేదంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ప్రభుత్వం కూడా దాన్ని ఎక్కడా ఖండించలేదు. అక్టోబర్ 25వ తేదీన విజయదశమిని పురస్కరించుకుని విశాఖ నుంచి పరిపాలన సాగించడానికి గల అవకాశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటుపై..
వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ఇంకో కీలకమైనది.. కొత్త జిల్లాల ఏర్పాటు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లా కేంద్రంగా మార్చే ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఈ మధ్యకాలంలో కొత్త జిల్లాల ఏర్పాటు వార్తలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగరాదన్నట్టు.. ప్రభుత్వం దీని మీద లీకులు ఇచ్చిందని అంటున్నారు. ఇప్పటికే వెల్లడైన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఓ ముసాయిదాను రూపొందించారని, దీనిపై కేబినెట్లో చర్చిస్తారని సమాచారం.

వలంటీర్ల వేతనాల పెంపుపై..
వైఎస్ జగన్ బ్రెయిన్ ఛైల్డ్గా గుర్తింపు పొందిన గ్రామ/వార్డు వలంటీర్ల వేతనాల పెంపు అంశం కూడా మంత్రివర్గంలోకి చర్చకు రావచ్చని అంటున్నారు. దీనికి అయ్యే అదనపు ఖర్చు, విధి విధానాలపై ఆర్థికమంత్రిత్వ శాఖ ఇప్పటికే కసరత్తు చేసిందని తెలుస్తోంది. దీని గురించి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓ ప్రతిపాదనను సిద్ధం చేశారని, దీనికి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉందని సమాచారం.
Recommended Video

గత ప్రభుత్వ అవినీతిపై..
చంద్రబాబు ప్రభుత్వ హాయంలో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న అవినీతి, అక్రమాలపై ఇప్పటికే మంత్రివర్గం సీబీఐతో దర్యాప్తు చేయించడానికి తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తును మరింత ముమ్మరం చేసేలా కీలక నిర్ణయాలను తీసుకుంటారని అంటున్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో ఇప్పటిదాకా చోటు చేసుకున్న పురోగతి సహా, మరిన్ని వివాదాస్పద అంశాలపైనా దర్యాప్తును వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలపై కేబినెట్లో చర్చిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications