రాజధాని అమరావతిపై వైఎస్ జగన్ ఫోకస్.. బిగ్ ప్యాకేజ్: చంద్రబాబు ఇంటికి వెళ్లే దారి విస్తరణ
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి దృష్టి సారించినట్టే కనిపిస్తోంది. అమరావతి ప్రాంత పరిధిలో అభివృద్ధి పనులకు ఆయన కొద్దిసేపటి కిందటే శ్రీకారం చుట్టారు..శిలాఫలాకాలను ఆవిష్కరించారు. నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇది ముందే నిర్దేశించిన కార్యక్రమమే అయినప్పటికీ- ఈ నెల లేదా వచ్చేనెలలో సచివాలయం, క్యాంపు కార్యాలయాలన్ని సాగర నగరం విశాఖపట్నానికి తరలిస్తారంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో- అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
కొండవీటి వరద ఎత్తిపోతల పథకం కింద ప్రకాశం బ్యారేజీ నుంచి రాయపూడి వరకు సుమారు 15 కిలో మీటర్ల మేర కృష్ణానది కుడివైపు కరకట్ట విస్తరణ పనులకు వైఎస్ జగన్ కొద్దిసేపటి కిందటే శంకుస్థాపన చేశారు. దీనికోసం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నిధులను సమకూర్చింది. కృష్ణానదికి సంబంధించిన పనులు కావడం వల్ల జలవనరుల మంత్రిత్వ శాఖ దీన్ని పర్యవేక్షిస్తుంది. విస్తరణలో భాగంగా డబల్ రోడ్డును నిర్మిస్తుంది ప్రభుత్వం.

రెండు వైపులా ఫుట్పాత్ను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ రహదారిలో కొండవీటి వాగుపై ఉన్న వంతెనను పునర్నిర్మిస్తుంది. అలాగే- వెంకటాయపాలెం, రాయపూడి అవుట్ఫాల్ స్లూయిస్, వరద పర్యవేక్షణ కేంద్రాలను నిర్మిస్తారు. ఉండవల్లి నుంచి రాయపూడి మీదుగా అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్, గొల్లపూడి నుంచి చిన్నకాకాని మీదుగా విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానించేలా ఈ విస్తరణ పనులు ఉంటాయి. ఈ పనుల విస్తరణ, అభివృద్ధి పనుల వల్ల అమరావతి, సచివాలయం, హైకోర్టులకు రాకపోకలను మరింత మెరుగుపర్చినట్టవుతుంది.

దీనితోపాటు- తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్లూరు మండలం పరిధిలోని వెంకటపాలెం, మందడం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, ఉద్దండరాయునిపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కాగా- త్వరలో సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం విశాఖపట్నానికి తరలి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తోన్నాయి. అధికార పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి, ఉత్తరాంధ్ర మంత్రులు సైతం కొన్ని సందర్భాల్లో దీన్ని ప్రస్తావించారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కరకట్ట విస్తరణ పనులకు దిగడం చర్చనీయాంశమౌతోంది.













Click it and Unblock the Notifications