విభజన: సమాచారంపై సిఎస్ హెచ్చరిక, రెండు వెబ్సైట్లు
హైదరాబాద్/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియ వేగం పుంజుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లు పైన రాష్ట్ర సచివాలయంలో ప్రధాన కార్యదర్శి మహంతి బుధవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు అయిన 14 కమిటీలతో మహంతి సమావేశమయ్యారు. ఆస్తులు, అఫ్పులు, దస్త్రాలు, ఉద్యోగుల పంపిణీపై మార్చి నెలాఖరు నాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఐఏఎస్ల పంపిణీ కోసం శామ్యూల్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. జూన్ రెండో తేది నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పేరిట వెబ్ సైట్ రూపకల్పనకు నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ వివాదాస్పద నిర్ణయాలకు సంబంధించిన దస్త్రాలను గవర్నర్ నరసింహన్కు పంపించనున్నారు.
పద్నాలుగు కమిటీల పని తీరుపై మహంతి సమీక్ష జరిపారు. మార్చి 30వ తేదీ లోపు నివేదికలు, సమాచారం పూర్తిగా ఇవ్వాలని లేదంటే ఉద్యోగుల జీతాలు నిలిపివేయాల్సి ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తోంది. 15వ తేదీకల్లా ఉద్యోగులు వ్యక్తిగత సమాచారం ఇవ్వాలన్నారు. కాగా, గురువారం కమల్ నాథ్ కమిటీ రాష్ట్రానికి రానున్న విషయం తెలిసిందే.
ఉమ్మడిలోనే ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధఇంచి ఇప్పటి వరకు ఉన్న వివరాలు, చట్టాల్లోని నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని లోకసభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ తెలిపారు. ఎన్నికైన శాసన సభ, పార్లమెంటు సభ్యులు ఎపిలోనే ఉంటారని, రాష్ట్ర విభజన తర్వాత రాజ్యాంగంలోని నిబంధనలు, అపాయింటెడ్ డే ప్రకారం ఆయా ప్రాంతాలకు శాసన సభ్యులు, ఎంపీలు అవుతారని ఆయన చెప్పారు. ఆ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందన్నారు. కొత్త పార్టీ నమోదుకు కోడ్ అడ్డంకి కాదన్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు: గవర్నర్
ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని భావిస్తున్నానని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆయన న్యూఢిల్లీలో ఉన్నారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రి చిదంబరం తదితరులను కలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలను కేంద్రానికి వివరించానని చెప్పారు. అడ్వయిజర్ల నియామకం రెండ్రోజుల్లో పూర్తవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. తాను ప్రధానిని కలుస్తానన్నారు. పెట్రోలు బంకుల్లో అవకతవకలకు పాల్పడవద్దని హెచ్చరించారు. బంకుల్లో వాడుతున్న యంత్రాలను తొలగించాలన్నారు.