ఏపీలో రైతులకు మరో పథకాన్ని ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడి ఆలోచనా విధానం మారింది. గతంలో సంక్షేమ పథకాలకన్నా అభివృద్ధి పనులకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చేవారు. ఇప్పుడు మాత్రం అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను కూడా సమాంతరంగా అమలు చేస్తానని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వరుసగా పథకాలను ప్రకటించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే పెంచిన పింఛన్లు ఇవ్వడంతోపాటు మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించనున్నారు.
తమ వాటాను రైతులు చెల్లిస్తే
ఈ పథకాల కోవలో తాజాగా రైతులకు సంబంధించి మరో పథకం చేరింది. సూక్ష్మ సేద్య పథకాన్ని (డ్రిప్ ఇరిగేషన్) శుక్రవారం నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీని ప్రకారం రైతులు తమ వాటాను చెల్లిస్తే మిగతా పరికరాలను ప్రభుత్వమే వివిధ కంపెనీల ద్వారా అందజేస్తుంది. అందుకు సంబంధించిన ఖర్చులను తానే పెట్టుకుంటుంది. ఉద్యాన రంగాన్ని ప్రోత్సహించాలని, అవసరం ఉన్న ప్రతి రైతుకు దీన్ని అమలు చేయాలని చంద్రబాబు ఉద్యానశాఖ అధికారులకు సూచించారు.

ఏడున్నర లక్షల ఎకరాల్లో
రెండున్నర లక్షల ఎకరాల్లో దీన్ని అమలు చేయాలని అధికారులు భావించగా చంద్రబాబు మాత్రం ఏడున్నర లక్షల ఎకరాలకు పెంచారు. పరికరాలు సరఫరా చేసే కంపెనీలకు గత ప్రభుత్వం రూ.1167 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం రూ.175 కోట్లు చెల్లించామని, మిగతా మొత్తాన్ని విడతల వారీగా చెల్లిస్తామని అధికారులు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తమకు నమ్మకముందని, అవసరమైన పరికరాలను వెంటనే అందజేస్తామని కంపెనీల ప్రతినిధులు హామీ ఇచ్చారు.
అమరావతి రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌలును మరో ఐదు సంవత్సరాలకు ప్రస్తుత ప్రభుత్వం పెంచింది. గతంలో పది సంవత్సరాలకు ఇస్తామని హామీ ఇవ్వగా, గత ఐదేళ్లు ఎటువంటి పనులు జరగకపోవడంతో మరో ఐదు సంవత్సరాలు కౌలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications