E20 Petrolతో మైలేజీ తగ్గుతుందా? కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ?
E20 Petrol: E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లు పాడైపోతున్నాయని.. మైలేజ్ పడిపోతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. ఇదంతా ప్రణాళికా ప్రకారం జరుగుతున్న దుష్పచారమని ఆయన కొట్టిపారేశారు. ఈ20 పెట్రోల్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావడానికి ముందు పుణెలోని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ప్రముఖ వాహన తయారీ సంస్థలు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అన్ని అనుమతులు వచ్చాకే దీనిని అమలు చేశామని తెలిపారు.
కొన్ని వాహనాల్లో సమస్యలు వచ్చినట్లు తేలడంతో కంపెనీలతో విచారణ జరిపించామని.. అందులో ఈ20 పెట్రోల్ వాడటం వల్ల కాకుండా.. కల్తీ ఇంధనం వల్లే సమస్యలు వచ్చినట్లు తేలిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ20 పెట్రోల్ వల్ల ఇప్పటివరకు ఓ ఒక్క వాహనం కూడా పాడవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పాత వాహనాల్లోని కొన్ని చిన్న విడిభాగాలపై స్వల్ప ప్రభావం పడే అవకాశం ఉందని.. అందువల్ల సర్వీసింగ్ సమయంలో వాటి స్థానంలో రబ్బర్ వాషర్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా మార్చాలని వాహన కంపెనీలను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

మైలేజీపై స్వల్ప ప్రభావం
పెట్రోల్తో పోలిస్తే ఇథనాల్ కు ఇంధన సామర్థ్యం కొంత తక్కువగా ఉంటుంది. దీనివల్ల మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్న మాట నిజమే అయినా.. చాలా సందర్భాల్లో ఈ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ వల్ల వాహనాలు తక్కువ గేర్లలో నడుస్తాయని.. పదే పదే బ్రేకులు వేయాల్సి వస్తుందని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు. స్థిరంగా 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటప్పుడు మైలేజ్ లో కొంత తేడా కనిపించవచ్చని.. కానీ నగరాల ట్రాఫిక్లో పెద్దగా మార్పు తెలియదని వివరించారు. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్లలో అసలు మైలేజ్ సమస్యే లేదని నివేదికలు చెబుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇథనాల్ వినియోగం వల్ల ఇంజన్ నాకింగ్ తగ్గుతుందని, దీని ఆక్టేన్ నంబర్ కూడా ఎక్కువేనని నితిన్ గడ్కరీ చెప్పారు. పనితీరు పరంగా ఇథనాల్ ఉత్తమమైనదని నిరూపితమైందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
ఫ్లైక్స్-ఫ్యూయల్ ఇంజన్ల వైపు అడుగులు
బ్రెజిల్లో 1970ల నుంచే 27 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని వాడుతున్నారని.. అక్కడ హోండా, హ్యుందాయ్ వంటి కంపెనీల ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇండియాలో కూడా టాటా మోటార్స్, మహీంద్రా, హ్యుందాయ్, టయోటా, మారుతి సుజుకి వంటి దాదాపు డజను కంపెనీలు తమ సరికొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రజలకు తక్కువ ధరలో ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.












Click it and Unblock the Notifications