ఏపీలోని గిరిజనులకు గుడ్ న్యూస్ ప్రకటించిన కూటమి ప్రభుత్వం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు ప్రకటించింది. ఇప్పటివరకు 5 కిలోల ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు.. ఇకపై 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్లు అందజేయనున్నారు. అంతే కాకుండా అదనంగా వారికి ఏడాదికి మూడు సిలిండర్లు పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు, స్థానికులు తమ సమస్యలను నేరుగా వివరించారని ఆయన గుర్తుచేశారు. వారి విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 16 జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఏలూరు, నంద్యాల, శ్రీకాకుళం, తిరుపతి వంటి జిల్లాల ప్రజలకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. ప్రభుత్వం అంచనా ప్రకారం, ఈ పథకం అమలు కోసం ఏటా సుమారు రూ.5.54 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ, గిరిజన సంక్షేమం దృష్ట్యా ఈ వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ఈ పథకం విజయవంతంగా అమలు కావడానికి హిందుస్థాన్ పెట్రోలియం (HPCL), ఇండియన్ ఆయిల్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL) వంటి ఆయిల్ కంపెనీలు కీలక పాత్ర పోషించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సిలిండర్ల సరఫరా సజావుగా జరిగేలా డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ను బలోపేతం చేయాలని సూచనలు ఇచ్చింది.
ఈ నిర్ణయం వల్ల అడవుల నాశనం తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతుంది. అలానే గృహాల్లో కట్టెలపై ఆధారపడే పరిస్థితి తగ్గిపోతుంది. వంట పనుల్లో సమయం తగ్గడంతో మహిళలు విద్య, ఉపాధి కోసం ఎక్కువ సమయం కేటాయించగలరు.












Click it and Unblock the Notifications