ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు...తెలుగుకి ప్రాధాన్యం!
Recommended Video
అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేసింది. చిహ్నంలో ఏపీ గవర్నమెంట్ అని ఆంగ్లంలో రాసి ఉన్న పదాలను తెలుగులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని మార్చింది.
అలాగే సత్యమేవ జయతే అనే పదాన్ని తెలుగులోకి మార్చడంతో పాటు ఇంతకుముందు హిందీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అనే అక్షరాలు కింది వైపుకు తిరిగి ఉండగా...తాజాగా సవరించిన లోగోలో ఆ అక్షరాలు పై వైపునకు తిరిగివున్నాయి. రాష్ట్ర అధికార చిహ్నంలో ఇలా మార్పులు చేయడం 54 ఏళ్ల తరువాత ఇదే మొదటిసారి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక లోగోలో మార్పులు చేర్పులు చేసి కొత్త లోగోకు ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత 1964 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఈ లోగోనే అధికారిక రాష్ట్ర చిహ్నంగా ఉండగా తాజాగా ఎపి ప్రభుత్వం దీనిలో మార్పులు చేసి కొత్త లోగోను ఆవిష్కరించింది. అయితే ఈ కొత్త లోగోను పూర్తి గా నూతనంగా రూపొందించడం కాకుండా పాత చిహ్నంలోనే కొన్ని మార్పులు చేయడం గమనార్హం.
గతంలో అధికారిక చిహ్నం విషయానికి వచ్చేప్పటికి లోగోలో ఉండాల్సింది పూర్ణ కుంభమా, పూర్ణ ఘటమా అనే సందేహాలు రేకెత్తగా...కొత్తగా రూపొందించిన అధికారిక చిహ్నంలో పూర్ణకుంభంనే ఖరారు చేశారు. ఈ మార్పుల అనంతరం నూతల అధికారిక రాష్ట్ర చిహ్నం గురించి ప్రభుత్వం జీవోను సైతం విడుదల చేసేసింది. పాత లోగోలో ఆంధ్రప్రదేశ్ అనే పేరు పైన ఆంగ్లంలో కింద తెలుగు, హిందీలో ఉంటుంది. అయితే ఈ కొత్త చిహ్నంలో రాష్ట్రం పేరు పైన తెలుగులో కింద హిందీ, ఇంగ్లీష్ లో ఉంటుంది. పాత చిహ్నంలో 'సత్యమేవ జయతే' అన్న వాక్యం హిందీలో ఉండగా తాజా లోగోలో దాన్ని కూడా తెలుగులోకి మార్చేశారు.
పాత రాష్ట్ర చిహ్నంలో మాదిరిగానే పూర్ణ కుంభం మధ్యలోనే ఉండగా దాని కింద నాలుగు సింహాలు ఉన్నాయి. ఈ చిహ్నాన్ని మల్టీకలర్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్ ఇలా మూడు రూపాల్లో ముద్రించుకోవచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రాష్ట్ర చిహ్నాన్ని ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, సీఎస్, ప్రభుత్వ కార్యదర్శులు, అడ్వొకేట్ జనరల్, శాఖల అధిపతులు, కలెక్టర్లు, సెక్రటేరియట్ లోని మధ్య స్థాయి అధికారులు వినియోగించుకోవడానికి అనుమతి ఉంది.