హైదరాబాద్ వాసులకు అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ.. ఒకే ట్రిప్ లో మూడు పర్యాటక ప్రాంతాలు..
హైదరాబాద్ మహానగరానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. భాగ్యనగరంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలు, కోటలు, ఆలయాలు, చారిత్రక కట్టడాలు పర్యటకులను మైమరిపింపజేస్తున్నాయి. హైదరాబాద్ అనగానే చాలామందికి చార్మినార్, గోల్కొండ ప్రాంతాలే గుర్తుకువస్తాయి. కానీ ఇటీవల కాలంలో అభివృద్ధి చెందిన అనేక పర్యాటక ప్రాంతాలు విశేషమైన జనాదరణ పొందుతూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ నగరవాసులకు ప్రశాంత వాతావరణాన్ని అందించడంలో కొత్వాల్ గూడ ఎకో పార్క్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అలాగే ఎక్స్ పీరియం ఎకో పార్క్ కూడా పర్యటకుల తాకిడి పెరిగింది. వీకెండ్ వస్తే చాలు పిల్లలతో కలిసి హాయిగా సాయంత్రం వరకూ ఈ పార్క్ లో సరదాగా గడిపి ఇంటికెళ్తున్నారు. ఇక వీటికి దగ్గరలోనే ఉన్న చిల్కూర్ బాలాజీ ఆలయం కూడా చాలా ఫేమస్. ఈ ఆలయాన్ని సందర్శించి ఆ తర్వాత ఈ రెండు ఎకో టూరిజం పార్కులను చుట్టేసే విధంగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకెండ్ లో ప్రజలు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోంది.
హైదరాబాద్ నగరవాసుల కోసం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లిమిటెడ్ (టీజీటీడీసీ) సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి చిల్కూర్ బాలాజీ ఆలయం సందర్శన.. అక్కడి నుంచి ఎక్స్ పీరియం ఎకో పార్క్ టూర్ అలాగే కొత్వాల్ గూడ ఎకో టూరిజం పార్క్ లో సందర్శనతో వన్ డే టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి వీకెండ్ విహారానికి పిల్లలు, పెద్దలకు సరైన యాత్రగా నిలుస్తుంది. ఈ టూర్ కు సంబంధించిన బస్సు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ లోని యాత్రి నివాస్ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఆ తర్వాత ఉదయం 8 గంటలకు తారామతి బరాదరిలో అల్పాహారం.. 9 గంటలకు చిల్కూర్ బాలాజీ ఆలయంలో దర్శనం ఉంటుంది. ఆ తర్వాత 11 గంటల 30 నిమిషాలకు ఎక్స్ పీరియం ఎకో పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు శాకాహార భోజనం, మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు కొత్వాల్ గూడ ఎకో టూరిజం పార్క్ సందర్శన ఉంటుంది. ఇక సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు హై- టీ, రాత్రి7 గంటలకు బషీర్ బాగ్ లోని సీఆర్ ఓ కు చేరడంతో టూర్ ముగుస్తుంది.

టికెట్ ధరల వివరాలు చూస్తే.. పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 2,100 గా ఉంది. అలాగే పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 1,800 గా అధికారులు నిర్ణయించారు. ఇక ఈ టూర్ కు సంబంధించిన బుకింగ్, ఇతర వివరాల కోసం తెలంగాణ టూరిజం ఆఫీస్ 9848126947, 9848125720, 9848306435 కు పర్యాటకులు సంప్రదించాల్సి ఉంటుంది.













Click it and Unblock the Notifications