నైగర్లో సైన్యం తిరుగుబాటు: ప్రవాసాంధ్రుల కోసం ఏపీ సర్కారు కీలక నిర్ణయం
అమరావతి: పశ్చిమ ఆఫ్రికాలోని నైగర్(Niger)లో అధ్యక్షుడు మహ్మద్ బజౌమ్కు వ్యతిరేకంగా సైన్యం ఇటీవల తిరుగుబాటు చేసిన క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నైగర్లో ఉన్న భారతీయులంతా వెనక్కి రావాలని కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు ఆ దేశంలోని ప్రవాసాంధ్రులు తక్షణమే తిరిగి రావాలంటూ ఏపీఎన్ఆర్టీఎస్ హెచ్చరికలు జారీ చేసింది.
ప్రవాసాంధ్రుల కోసం రెండు హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్ఆర్డీఎస్ సీఈవో తెలిపారు. నైగర్లోని ఆ దేశ అధ్యక్షుడిపై అక్కడి సైన్యం తిరుగుబాటు చేసిన నేపథ్యంలో విమాన రాకపోకలు నిలిపివేసినట్లు విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
నైగర్లో ఎయిర్ స్పేస్ మూసివేయడంతో భూమార్గంలో సరిహద్దుల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచనలు చేసింది. నైగర్లోని భారతీయులంతా నియామీలోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవాలని తెలిపింది.

భారతీయ పౌరుల సహాయం కోసం +227 9975 9975 అత్యవసర నెంబర్ ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇది ఇలావుండగా, ప్రవాసాంధ్రుల కోసం +91 8500027678, 08632340678 హెల్ప్లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు ఏపీఎన్ఆర్డీఎస్ వెల్లడించింది.
మరోవైపు, ఆఫ్రికన్ దేశంలో నైగర్ లో సైనిక తిరుగుబాటు తరువాత భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నైగర్లో పరిస్థితిని భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ప్రజలు నియామీకి ప్రయాణిస్తుంటే తమ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని MEA ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. అక్కడ ఉండాల్సిన అవసరం లేని భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం వీడాలని పేర్కొంది.
"నైగర్లో జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, వారి ఉనికి అవసరం లేని భారతీయ పౌరులు వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం గగనతలం మూసివేయబడిందని వారు గుర్తుంచుకోవచ్చు. బయలుదేరేటప్పుడు భూ సరిహద్దు ద్వారా భద్రతను నిర్ధారించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. రాబోయే రోజుల్లో నైగర్కు వెళ్లాలని ప్లాన్ చేసే వారు కూడా పరిస్థితి సాధారణమయ్యే వరకు వారి ప్రయాణ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని సూచించారు" అని విదేశాంగ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications