జగన్ ప్రతిష్ఠాత్మక పధకానికి హైకోర్టు బ్రేక్ - మహిళలకేనా ఇళ్ల పట్టాలు : పేదలందరికీ ఇళ్లు -తక్షణం ఆపండి..!!
ముఖ్యమంత్రి జగన్ మానస పుత్రిక పధకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మహిళలకే ఇళ్ల పట్టాలు ఇవ్వటం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. అర్హత ఉన్న పురుషులు..ట్రాన్స్ జెండర్లకు అవకాశం ఇవ్వాలని సూచించింది. కన్వేయన్స్ డీడ్ ను రద్దు చేసి..డీ- ఫారం పట్టా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయటంతో..దీని పైన అప్పీల్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెంటున్నర స్థలాల్లో గృహ సముదాయాలు ఏర్పాటు చేస్తామనడంలో హేతుబద్ధత పైన కోర్టు ప్రశ్నలు సంధించింది.

అధ్యయనం తరువాతనే పధకం అమలు
దీని పైన లోతైన అధ్యయనం అసవరమని తేల్చి చెప్పింది. అప్పటిదాకా ఈ పథకాన్ని అమలు చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో..ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్న వాదనను తిరస్కరిస్తున్నామని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం కల్పించిన మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు భావిస్తే కోర్టు జోక్యం చేసుకోవచ్చుంటూ తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన 'నవ రత్నాలు - పేదలందరికీ ఇళ్లు' పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సర్కారు నిర్ణయించుకుంది.

మహిళలకే కాదు..వారికి ఇవ్వాలి
దీనిపై 2019 డిసెంబరు 2న జారీ చేసిన 367, 488 మార్గదర్శకాల జీవోలను సవాల్ చేస్తూ తెనాలికి చెందిన పొదిలి శివమురళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పట్టాలను కేవలం మహిళా లబ్ధిదారులకే కేటాయించడంపై అభ్యంతరం తెలిపారు. పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులను ఆదేశించాలని పిటీషన్ లో కోరారు. దీని పైన పిటీషనర్లతో పాటుగా ప్రభుత్వం తరపున వాదోపవాదాలు విన్న అనంతరం జస్టిస్ సత్యనారాయణ మూర్తి తీర్పు వెలువరించారు.

సెంటు భూమిలో ఇల్లా
పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్ల స్థలంలో ఇంటిని కట్టుకోవాలంటున్నారని... ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. గృహ సముదాయాలు నిర్మించేటప్పుడు... ఆ ప్రాంతంలోని జనసాంద్రతకు అనుగుణంగా మౌలికవసతులు కల్పించకపోతే భవిష్యత్తులో అవి మురికివాడలు అవుతాయని హైకోర్టు పేర్కొంది. రైట్ టు షెల్టర్' పొందేందుకు చట్టాలు ఉన్నాయని... కానీ, ఎంత విస్తీర్ణంలో ఇళ్లు ఉండాలనే చట్టాలు లేవని చెబుతూనే... మానవహక్కులు, అంతర్జాతీయ ఒప్పందాలలో భారతదేశం భాగస్వామిగా ఉన్నందున... తగినంత నివాస స్థలం కలిగి ఉండడం మానవ హక్కుల్లో భాగమే. అలా లేకపోతే జరిగే అనర్థాలపై నిపుణుల కమిటీతో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

కమిటీ నివేదిక తరువాత నిర్ణయం
ఇళ్ల నిర్మాణం విషయంలో పర్యావరణ ప్రభావం, ఆరోగ్య సమస్యల పై అధ్యయనం చేసేందుకు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర గృహ పట్టణాభివృద్ధి మంత్రిత్వ వ్యవహారాల శాఖ, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖలతో కూడిన ముగ్గురు నిపుణులతో నెల రోజుల్లో కమిటీ వేయాలని స్పష్టం చేసింది. ఆ కమిటీ ఏర్పాటైన నెలలో తన నివేదిక అందించాలని ఆదేశించింది. కమిటీ నివేదికను రెండు స్థానిక పత్రికల్లో ప్రచురించి... ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించింది.

జగన్ ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకం - అప్పీల్ కు నిర్ణయం
ఆ తర్వాతే 'పేదలందరికీ ఇళ్లు' పథకాన్ని ఖరారు చేయాలి. ప్రత్యేక కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే అదనంగా భూమి కొనుగోలు చేసి, ఇంటి స్థలం విస్తీర్ణం పెంచి లబ్ధిదారులకు కేటాయించిన లేఅవుట్లను సవరించాలి. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు 'నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు' పథకం కింద లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దు'' అని ఆదేశించింది. దీని పైన ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లాలని డిసైడ్ అయింది. ప్రభుత్వం ఈ పధకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లోగా నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఈ నిర్ణయం అమలుకు బ్రేకులు పడే అవకాశం ఉంది. దీంతో..దీని పైన న్యాయ పరంగా పోరాటం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది.












Click it and Unblock the Notifications