ఏపీ మున్సిపల్ పోల్స్లో వైసీపీ ప్రభంజనం- పలు మున్సిపాల్టీలు, కార్పోరేషన్లు కైవసం
ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఇందులో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పోరేషన్లపై వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. దీంతో టీడీపీతో పాటు ఇతర విపక్షాలు కేవలం కొన్ని సీట్లకే పరిమితమయ్యే పరిస్ధితి నెలకొంది.
ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ప్రకాశం జిల్లా కనిగిరి, గిద్దలూరు, చీమకుర్తి నగర పంచాయతీలు మార్కాపురం, అద్ధంకి మున్సిపాలిటీలు, నెల్లూరు జిల్లా ఆత్మకూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపాల్టీలు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా తుని, రామచంద్రపురం, అమలాపురం, సామర్గకోట, కర్నూలు జిల్లా డోన్, ఆత్మకూరు మున్సిపాల్టీలను వైసీపీ కైవసం చేసుకుంది. గుంటూరు జిల్లాలో రేపల్లె, సత్తెనపల్లి, వినుకొండ మున్సిపాలిటీలు వైసీపీకి దక్కాయి. ప్రకాశం జిల్లా కనిగిరిలో అయితే 20 వార్డులకు గానూ 20 వార్డులూ వైసీపీ ఖాతాలోకి చేరాయి. కడప జిల్లా రాయచోటిలోనూ ఇదే పరిస్ధితి. ఇక్కడ రాయచోటితో పాటు ఎర్రగుంట్ల మున్సిపాల్టీని వైసీపీ గెల్చుకుంది. అనంతపురం జిల్లా మడకశిర నగరపంచాయతీ సైతం వైసీపీ ఖాతాలో చేరింది. అటు కార్పోరేషన్లలోనూ వైసీపీ హవా కొనసాగుతోంది. కడప, చిత్తూరు,గుంటూరు, ఒంగోలు, తిరుపతి, కర్నూలు, కార్పోరేషన్లను వైసీపీ ఇప్పటికే కైవసం చేసుకుంది. మిగగతా కార్పోరేషన్లలోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతోంది.
ఉభయ గోదావరి జిల్లాల్లోనూ వైసీపీ ఆధిపత్యం కొనసాగుతున్నా పలు చోట్ల టీడీపీ-జనసేన అవగాహనతో పోటీ చేయడంతో ఇరువురూ లబ్ది పొందిన పరిస్ధితి కనిపిస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల కూడా టీడీపీ పలు స్ధానాలు కైవసం చేసుకుంటోంది.
అలాగే టీడీపీ బలహీనంగా ఉన్న చోట జనసేన కూడా ప్రభావం చూపుతోంది. గతంలో అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయిన జనసేన తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో పలు స్ధానాలు కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.