పవన్ కల్యాణ్ దగ్గర ''తాళం చెవి''?
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం మొత్తం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతోంది. విడిగా పోటీచేస్తే ఎన్ని సీట్లు గెలువగలుగుతుందో అనేది అనుమానమే. మహా అయితే ఒక 10 సీట్లు గెలుచుకుంటే గొప్ప అనేవారున్నారు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీచేస్తే రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. పొత్తు పెట్టుకున్నా పెద్దన్నగా తెలుగుదేశం ఉంటుంది. జనసేనది ద్వితీయ స్థానం.
రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిలబెట్టడానికి బలమైన అభ్యర్థులు లేరు. ఎంపీ నియోజకవర్గాలైతే ఆలోచన కూడా అనవసరం. కానీ రాజకీయం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయినా, టీడీపీ అధినేత చంద్రబాబు అయినా పవన్ పేరు స్మరించాల్సిందే. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలంతా జనసేనాని పేరు స్మరిస్తూ.. స్మరిస్తూ.. ఉండాల్సిందే. అంతలా ఏపీలో ప్రభావాన్ని చూపుతున్నారు. జనసేన పార్టీ విడిగా పోటీచేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది. 40 నుంచి 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను తారుమారు చేయగలదు.

తనకెన్ని సీట్లు వస్తాయనేదానికన్నా ప్రత్యర్థి పార్టీ గెలవగులుగుతుందా? ఓటమి పాలవుతుందా? అనేదానికి సమాధానం జనసేన దగ్గర ఉంది. అందుకే రాజకీయాల్లో పవన్ కల్యాణ్ కు డిమాండ్ పెరిగింది. తెలుగుదేశం, జనసేన కలిస్తే వైసీపీకి చెక్ పెట్టవచ్చు అనేది ఈ రెండు పార్టీల ప్రణాళికగా ఉంది. జనసేన తమతో కలిస్తే అధికార పీఠాన్ని సులువుగా అధిరోహించవచ్చని తెలుగుదేశం భావిస్తోంది. ఈ రెండు పార్టీలు కలవనీయకుండా అధికార పార్టీ రాజకీయం.. ఇలా ఎటుచూసినా పలాస నుంచి హిందూపురం వరకు అంతా పవన్ చుట్టూతా తిరుగుతోంది. ఏపీలో రాజకీయాన్ని మార్చగలిగే దశకు చేరుకున్న జనసేన త్వరలోనే ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే స్థాయికి వస్తుందని ఆ పార్టీ నాయకులు, పవన్ అభిమానులు విశ్వాసంతో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏపీలో రాజ'కీ'యం అంతా పవన్ దగ్గరే కేంద్రీకృతమై ఉంది.












Click it and Unblock the Notifications