మహారాష్ట్ర తర్వాత ఏపీనే: భారీగా కొత్త కేసులు, యాక్టివ్ కేసుల్లో రెండో స్థానం, 97 మంది మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. పరీక్షల సంఖ్య పెంచుతున్న కొద్దీ కేసులు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా, 24 గంటల్లో కొత్తగా 8943 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
భారీగా కరోనా కేసులు.. అత్యధిక పరీక్షలు
తాజాగా నమోదైన 8943 కరోనా కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,73,085కి చేరినట్లు తెలిపింది. ఒక్క రోజులో 53,026 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు నిర్వహించిన నమూనాల పరీక్షల సంఖ్య 27,58,485 చేరింది. గత 24 గంటల్లోనే మరో 9779 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 89,907 యాక్టివ్ కేసులు ఉండగా, 1,80,703 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
కర్నూలులో అత్యధిక మరణాలు.. మొత్తం 97
తాజాగా, 97 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 2475కి చేరింది.కర్నూలు జిల్లాలో అత్యధికంగా 12 మంది మృతి చెందగా, తూర్పుగోదావరి, గుంటూరు, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 10 మంది చొప్పున, అనంతపురం, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఆరుగురు చొప్పున, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు.
అత్యధిక కేసులు తూర్పుగోదావరిలో.. జిల్లాల వారీగా..
తాజాగా, నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాల్లోనే ఉన్నాయి. జిల్లా వారీగా కేసులను గమనించిట్లయితే.. అనంతపురంలో 762, చిత్తూరులో 987, తూర్పుగోదావరిలో 1146, గుంటూరులో 527, కడపలో 530, కృష్ణాలో 338, కర్నూలులో 956, నెల్లూరులో 669, ప్రకాశంలో 300, శ్రీకాకుళంలో 547, విశాఖపట్నంలో 885, విజయనగరంలో 548, పశ్చిమగోదావరిలో 748 కరోనా కేసులున్నాయి.
మహారాష్ట్ర తర్వాత ఏపీనే..
ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో ఏపీ మూడోస్థానంలో కొనసాగుతోంది. మొదట రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. అయితే, అత్యధిక యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర తర్వాత ఏపీనే ఉండటం గమనార్హం. కరోనా పరీక్షల్లో మూడో స్థానంలో ఉంది. కాగా, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 24,83,567 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 6,64,033 యాక్టివ్ కేసులున్నాయి. 17,70,682 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 48,367 మంది మరణించారు.