విషాదం: చెన్నై మెరీనా బీచ్లో ముగ్గురు ఏపీ విద్యార్థులు గల్లంతు, ఒకరు మృతి
చెన్నై: తమిళనాడులోని చెన్నై మెరీనా సముద్ర తీరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరిలో ఒక విద్యార్థి మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి కోసం సహాయక బృందాలు గాలింపు చేపట్టాయి. చనిపోయిన విద్యార్థి గుంటూరుకు జిల్లాకు చెందినవాడు.
స్నేహితులతో కలిసి చెన్నైకి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన సూరా గోపిచంద్(18) ఇటీవల ఇంటర్ పూర్తి చేశాడు. చెన్నైలో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం దుందిరాలపాడు శివారు మల్లెంపాడుకు చెందిన వాకదాని ఆకాశ్(18)తోపాటు గుంటూరులోని పొత్తూరుకు చెందిన శివబాలాజీ(19)తో కలిసి రెండ్రోజుల క్రితం చెన్నైకి వెళ్లాడు.
మెరీనా బీచ్లో ముగ్గురు గల్లంతు.. ఒకరు మృతి
ఈ క్రమంలో చెన్నైలోని మరో ఇద్దరు స్నేహితులు రాజశేఖర్, శివ ప్రశాంత్తో కలిసి గురువారం మెరీనా బీచ్కు వెళ్లారు. రాజశేఖర్, శివప్రశాంత్ ఒడ్డున ఉన్నారు. మిగిలిన ముగ్గురు సముద్రంలోకి దిగి గల్లంతయ్యారు. చెన్నై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి శివబాలాజీ మృతదేహాన్ని వెలికితీశారు. మిగితా ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఘటననకు సంబంధించిన సమాచారం తెలియడంతో విద్యార్థుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
సరదాగా పొలాలకు వెళ్లి..
ఇది ఇలావుండగా, ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం వీఠమూసారపల్లెలో ప్రమాదవశాత్తు సగిలేరువాగులో పడి ముగ్గురు బాలికలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీఠమూసారపల్లె గ్రామానికి చెందిన సారె పెదవెంకట సుబ్బయ్య, వెంకట సుబ్బయ్య అన్నదమ్ములు. వీరి ఇద్దరు కుమార్తెలు వెంకటదీప్తి(13), సుప్రియ(14)లు గురువారం తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ వారికి వరుసకు చెల్లెలు అయిన సుస్మిత(10), మరో బాలుడితో కలిసి సరదాగా తమ పొలాలకు వద్దకు వెళ్లారు. కాసేపు అటుఇటూ తిరిగారు.
వాగులో పడి ముగ్గురు అక్కాచెల్లెల్లు మృతి
ఆ తర్వాత చేతులను శుభ్రం చేసుకునేందుకు సమీపంలోని సగిలేరు వాగు వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తూ ముగ్గురు బాలికలూ వాగులో జరిపడ్డారు. ఇదంతా వారివెంట వెళ్లిన బాలుడు గమనించి వెంటనే కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లి చెప్పాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న వారి కుటుంబసభ్యులు బాలికలను పైకి తీసి గిద్దలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, ముగ్గురు బాలికలు అప్పటికే ప్రాణాలు కోల్పోయారని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలికల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. స్థానిక తీవ్ర విషాదం నెలకొంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.