నేటి నుంచే ముఖ్యమంత్రి యువనేస్తం...ఉండవల్లిలో సిఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
అమరావతి:నిరుద్యోగ యువతను ఆదుకునే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 'ముఖ్యమంత్రి యువనేస్తం' పథకం నేటి నుంచే అమలు కానుంది. టిడిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పథకాన్ని అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున సిఎం చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభిస్తారు.
అర్హులైన నిరుద్యోగుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.1000 చొప్పున నగదు జమ చేయనుండటమే ఈ పథకం లక్ష్యం. ఈ పథకానికి ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సివుండగా కొన్ని నిబంధనలు కఠినంగా ఉన్నట్లు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడంతో వాటిని సవరించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ క్రమంలో నేడే రాష్ట్రవాప్తంగా అర్హులైన లక్షలాదిమంది నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు సర్వం సిద్దం చేశారు.
మంగళవారం ఉండవల్లి ప్రజావేదికలో జరిగే 'ముఖ్యమంత్రి యువనేస్తం' ప్రారంభోత్సవం కార్యక్రమానికి 13 జిల్లాల నుంచి 400 మంది లబ్ధిదారులు హాజరవుతారని తెలిసింది.ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు నిరుద్యోగ భృతి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వారికి యువనేస్తం ధ్రువపత్రాలను పంపిణీ చేస్తారు. ఇదే సమయంలో 13 జిల్లా కేంద్రాల్లోనూ, 175 నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారుజ. దీనికోసం ప్రతి జిల్లాకు రూ.5 లక్షలు కేటాయిస్తూ యువజన సంక్షేమ శాఖ ఉత్తర్వులిచ్చింది.
గాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు కానుకగా మంగళవారం నుంచి నిరుగ్యోగ భృతి పథకం 'ముఖ్యమంత్రి యువనేస్తం' ప్రారంభం కానున్న నేపథ్యంలో సిఎం చంద్రబాబు సోమవారమే సచివాలయంలో మంత్రి లోకేశ్తో, యువజన సంక్షేమ శాఖ అధికారులతో ప్రత్యేక సమీక్ష జరిపారు. ధరఖాస్తులో కొన్ని నిబంధనలు కఠినంగా ఉన్నాయంటూ నిరుద్యోగుల అభ్యర్థనల మేరకు వాటిలో సడలింపులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి అర్హత పొంది అవగాహన లేక అప్లయ్ బటన్ క్లిక్ చేయనివారికి సైతం ఈ నెల నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలని సిఎం చంద్రబాబు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి ఇప్పటివరకు సుమారు 2,10,000 మంది అర్హత సాధించారని సీఎం చంద్రబాబుకు మంత్రి లోకేష్ వివరించారు. అర్హులైన 1,86,000 మంది బ్యాంకు ఖాతాలకు పైలట్గా రూ.1 జమ చేసి చూశామని, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తలేదని లోకేష్ తెలిపారు. ముఖ్యమంత్రి చెప్పిన విధంగా అప్లయ్ బటన్ అప్లయిచేయని మరో 20 వేల మంది లబ్ధిదారులుగా మారనున్నట్లు చెప్పారు. మంగళవారం బ్యాంకులకు సెలవు కావడంతో అర్హులకు బుధ, గురు వారాల్లో భృతిని జమ చేస్తామని మంత్రి లోకేష్ వివరించారు.
లోకేష్ వివరణ అనంతరం సిఎం చంద్రబాబు మాట్లాడుతూ లబ్ధిదారులకు నిరుద్యోగ భృతి కింద ఇచ్చే రూ.1000తో పాటు అప్రెంటిస్షిప్ సమయంలో అదనంగా మరో రూ. 1500 ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి పొందుతున్న లబ్ధిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే విషయం పైనా లోకేష్ తో సిఎం చర్చించారు.
ఇదిలావుంటే ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి నమోదులో ఎదురవుతున్న ఇబ్బందులపై ధరఖాస్తుదారుల నుంచి అందే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖలన్నిటిలో నోడల్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఫిర్యాదులు వారం రోజుల్లో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నామని... సమస్య పరిష్కరించిన తర్వాత కూడా మళ్లీ అభ్యంతరాలు తలెత్తుతూనే ఉంటే మళ్లీ ఆ ఫిర్యాదులను పైస్థాయి అధికారికి పరిశీలనకు పంపిస్తారని తెలిసింది.సర్వర్ స్తంభించడం తో పాటు ఎలాంటి ఇతర సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.