ట్రైన్ టాయిలెట్స్ వెనుక షాకింగ్ స్టోరీ- ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సిందే..!!
రైలు ప్రయాణం అంటే చాలా సుఖవంతమైన ప్రయాణం. ఎందుకంటే ఇందులో దాదాపు అన్ని సదుపాయాలు ఉంటాయి. పైగా టికెట్ ధరలు కూడా మిగతా ప్రజారవాణా సంస్థలతో పోలిస్తే తక్కువగానే ఉంటాయి. ఇక కాలక్రమంలో భారతీయ రైల్వేల్లో పెను మార్పులు చాలానే వచ్చాయి. రైళ్ల ప్రయాణంలో ఆహారం లభిస్తుంది. అంతేకాదు ట్రైన్లోనే ఉంటూ ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసుకుంటే వచ్చే స్టేషన్లో ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు ప్రయాణికులకు ఆహారం పార్శిల్ను అందిస్తున్నాయి. అంతలా భారతీయ రైల్వేస్ అభివృద్ధి చెందాయి. ఇక ఇండియన్ రైల్వేస్లో సాధారణ టాయిలెట్స్ నుంచి బయో టాయిలెట్స్గా రూపాంతరం చెందాయి. అయితే రైళ్లలో టాయిలెట్స్ కాన్సెప్ట్ ఎలా వచ్చిందో తెలుసా..? దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ కథ దాగి ఉంది.
టాయిలెట్స్ లేని సమయంలో...
టాయిలెట్స్ లేని రైళ్లను మనం ఊహించగలమా..? అసలు ప్రయాణం చేయగలమా..? ఇప్పుడంటే ప్రతీ రైలులో ప్రయాణికుల సౌకర్యార్థం టాయిలెట్స్ ఉన్నాయి కానీ... 1900 కంటే ముందు రైళ్లలో టాయిలెట్స్ ఉండేవి కాదు. ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడిపోయేవారు. భారతదేశంలో తొలి రైలు 1853లో ముంబై నంచి థానే వరకు పట్టాలపై పరుగులు పెట్టింది. ఆ తర్వాత క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు రైల్వే విస్తరించింది. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే ప్రయాణికులకు టాయిలెట్ సదుపాయం ఉండేది కాదు. దీంతో రైళ్లు కొన్ని స్టేషన్లలో ఎక్కువ సేపు ఆగేవి. ఆ స్టేషన్లలోనే ప్రయాణికులు దిగి వాష్ రూమ్స్ వినియోగించుకుని తిరిగి రైలు ఎక్కేవారు. ఉన్న ఒకటి రెండు బాత్రూంలలో పెద్ద సంఖ్యలో ఉన్న ప్రయాణికులు తమ కాలకృత్యాలు తీర్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడేవారు. దీంతో రైలు ప్రయాణం సవాలుతో కూడుకున్నదిగా మారింది.

టాయిలెట్స్కు ఆద్యుడు చంద్రసేన్
ఇక రైలులో టాయిలెట్స్ తీసుకురావాలన్న ఆలోచన కాస్త ఫన్నీగా ఉన్నప్పటికీ.. ఆ ఆలోచన ఒక చరిత్రగా నిలిచింది. 1909లో ఒకిల్ చంద్రసేన్ అనే ప్రయాణికుడు రైలులో ప్రయాణిస్తుండగా ఆయన కడుపులో ఇబ్బంది తలెత్తింది. దీంతో అహ్మదాపూర్ రైల్వే స్టేషన్లో రైలు ఆగినప్పుడు... స్టేషన్లోని వాష్రూంకు వెళ్లాడు. ఈ లోగ రైలు గార్డు విజిల్ వేశాడు. అంటే ఇక రైలు కదులుతుంది. ఆ సమయంలో ఆందోళన చెందిన చంద్రసేన్ వెంటనే ధోతీని సర్దుకుని రైలు ఎక్కేందుకు పరుగులు తీశాడు. ఈ క్రమంలో ఆయన ప్లాట్ఫాంపై పడిపోయాడు. దీంతో రైలు మిస్ అయిపోయాడు. చాలా ఆవేదనకు గురైన చంద్రసేన్ ఆనాటి బ్రిటీష్ పాలకులకు 1909 జూలై 2వ తేదీన ఒక లేఖ రాశాడు. తనకు వచ్చీ రాని ఇంగ్లీషులో తన ఆవేదన లేఖ ద్వారా తెలియజేశాడు.
స్పందించిన అధికారులు
చంద్రసేన్ లేఖను అందుకున్న రైల్వే అధికారులు జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు.ఆ తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు. 50 మైళ్లు అంతకంటే ఎక్కువగా ప్రయాణించే ప్రతీ రైళ్లలో టాయిలెట్స్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం నాటి రైల్వే అధికారులు తీసుకున్నారు.ఇక ఆ నిర్ణయం అమలు చేయడంతో అప్పటి నుంచి ప్రతి కోచ్లోను టాయిలెట్స్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక చంద్రసేన్ రాసిన ఆ లేఖను అధికారులు భద్రపరచారు. న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియంలో చంద్రసేన్ లేఖ మనకు దర్శనమిస్తుంది.
రైళ్లలో టాయిలెట్స్ కథ వినేందుకు చదివేందుకు కొంత సరదాగా ఉన్నప్పటికీ... ఈ టాయిలెట్స్ వచ్చేందుకు కృషి చేసిన సాధారణ బెంగాలీ పౌరుడు చంద్రసేన్ను ఎప్పటికీ మర్చిపోకూడదు.ఆనాడు తాను పడ్డ బాధ ఆవేదన ఆ తర్వాత లేఖ రాయడంతోనే నేడు రైలు ప్రయాణం చేస్తున్న కొన్ని మిలియన్ మంది ప్రయాణికులు టాయిలెట్ టెన్షన్ లేకుండా జర్నీని సాఫీగా ముగిస్తున్నారు.అందుకే ఎప్పుడైనా ట్రైన్ టాయిలెట్ వినియోగించినప్పుడు చంద్రసేన్కు మనసులో ఒక థాంక్యూ చెప్పేద్దాం.













Click it and Unblock the Notifications