పోలీస్ హెడ్క్వార్టర్స్లోనే త్రిపుర డీజీపీ అనుమానాస్పద మృతి!
త్రిపుర డీజీపీ, సీనియర్ ఐపీఎస్ అధికారి అనురాగ్ ధన్కర్ ఆకస్మిక మరణం తీవ్ర కలకలం రేపింది. అగర్తలాలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన కార్యాలయంలో ఆయన సోమవారం నాడు మృతదేహమై కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెడ్క్వార్టర్స్లోని తన ఛాంబర్లోనే ఆయన ఉరేసుకుని వేలాడుతూ కనిపించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్పందించిన తోటి సిబ్బంది ఆయనను అగర్తలాలోని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం అక్కడ తదుపరి వైద్య ప్రక్రియలు కొనసాగుతున్నాయి.
ఘటనాస్థలికి సీనియర్ అధికారులు
ఘటనాస్థలికి సీనియర్ పోలీస్ అధికారులు చేరుకుని విచారణ నిమిత్తం ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. ఆయన మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు సమగ్ర విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై త్రిపుర పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కేసు దర్యాప్తు పురోగతి సాధించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనతో త్రిపుర పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా షాక్కు గురైంది.

డీజీపీ ఆఫీసుకు ముఖ్యమంత్రి
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఘటనాస్థలికి చేరుకున్నారు. డీజీపీ కార్యాలయంతో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన బయటకు వచ్చారు. అక్కడ వేచి చూస్తున్న మీడియా ప్రతినిధులతో మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ముఖ్యమంత్రి సందర్శన అనంతరం కూడా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఊహాగానాలు.. స్పష్టత ఇవ్వని ప్రభుత్వం
ప్రస్తుతం సోషల్ మీడియా, పలు ఆధారాలు లేని వర్గాల ద్వారా ఈ ఘటనపై రకరకాల ప్రచారాలు, కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ వార్తలను త్రిపుర ప్రభుత్వం గానీ, త్రిపుర పోలీస్ శాఖ గానీ అధికారికంగా ధ్రువీకరించలేదు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే అధికారులు పూర్తి వివరాలతో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
డీజీపీ అనురాగ్ ధన్కర్ నేపథ్యం
ఈ ఘటనతో వార్తల్లో నిలిచిన త్రిపుర డీజీపీ అనురాగ్ ధన్కర్ 1994 బ్యాచ్కు చెందిన త్రిపుర కేడర్ ఐపీఎల్ అధికారి. ఆయన మే 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టడానికిముందు ఆయన త్రిపుర డీజీపీ(ఇంటెలిజెన్స్)గా సేవలందించారు. మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన కెరీర్ కలిగిన అనురాగ్ ధన్కర్.. రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో అనేక కీలక పదవులను నిర్వహించారు. వీటితో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్(సీబీఐ), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) వంటి కేంద్ర విభాగాల్లో డిప్యుటేషన్ పై సేవలందించిన అనుభవం కూడా ఆయనకు ఉంది.












Click it and Unblock the Notifications