రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్- ఇక నుంచి కొత్తగా..!!
రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత రేషన్ వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చింది. కొత్త కార్డులతో పాటుగా సరుకుల పంపిణీలోనూ కొత్త విధానాలు అమలు చేస్తోంది. ఇక, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఇక రేషన్ వ్యవస్థలో కీలక మార్పు జరగనుంది. అర్హులైన లబ్దిదారుల కు కొత్త పూర్తి వివరాలతో ఏటీఎం తరహా స్మార్ట్ కార్డులు ఇచ్చేందుకు రంగం సిద్దమైంది. రాష్ట్రంలో ని అందరు రేషన్ లబ్దిదారులకు ఈ కార్డులు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రేషన్ లబ్దిదారుల ప్రయోజనం కోసం ప్రభుత్వం కొత్త సంస్కరణల దిశగా నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త రేషన్ కార్డుల మంజూరు పైన ఫోకస్ చేసింది. నిత్యావసరాల్లో ఇచ్చే సరకుల సంఖ్యను పెంచింది. లబ్దిదారుల అవసరం మేరకు సరఫరాలో నిర్ణయాలు తీసుకుంటోంది. కాగా.. ఇప్పుడు తాజాగా మరో కీలక మార్పు అమలు చేసేందుకు సిద్దమైంది. రాష్ట్రంలో అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు స్మార్ట్ రేషన్ కార్డులను సిద్దం చేసారు. ఇప్పటి వరకు ఉన్న రేషన్ కార్డుల రూపురేఖలను మార్చేస్తూ, ప్రభుత్వం వీటిని అత్యంత ఆధునికంగా రూపొందించింది. రేషన్ షాపుల వారీగా లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా వీటిని త్వరలోనే పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

హైదరాబాద్ లో ప్రారంభించనున్న సీఎం రేవంత్
అయితే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల మార్పుపై దృష్టి సారించలేదు. అయితే, 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతమైంది. 2025 ఫిబ్రవరి నుండి కొత్త కార్డుల దరఖాస్తులు, మార్పులు చేర్పుల ప్రక్రియను చేపట్టడంతో ఈ ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1.06 కోట్ల నుంచి, లబ్ధిదారుల సంఖ్య 3,42,50,110కు పెరిగింది. కాగా.. లబ్దిదారులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వీటిని తీర్చి దిద్దారు. స్మార్ట్ రేషన్ కార్డులను వినూత్నంగా ఏటీఎం కార్డు సైజులో ప్లాస్టిక్తో తయారు చేశారు. ఈ కార్డుపై ఎడమ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో, కుడి వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫొటోలు ముద్రించారు. వీటితో పాటు లబ్ధిదారుడి పేరు, ప్రస్తుత ఫుడ్ సెక్యూరిటీ కార్డు నంబర్, భద్రత కోసం ప్రత్యేక క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచారు. సీఎం రేవంత్ హైదరాబాద్ లో ఈ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పంపిణీ చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు.












Click it and Unblock the Notifications