హెచ్చరిక..! ఏపీకి పొంచి ఉన్న ముప్పు?
వర్షాలు, వరదల నుంచి ఏపీ, తెలంగాణ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరదలవల్ల భారీగా నష్టపోయిన రెండు రాష్ట్రాలను ఆదుకునేందుకు అనేకమంది ముఖ్యమంత్రుల సహాయ నిధులకు విరాళాలను అందజేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బస్సునే ఇంటిగా చేసుకొని, కలెక్టరేట్ నే సచివాలయంగా మార్చుకొని అధికారులచేత పనిచేయించారు. తాను కూడా దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించి దాదాపు పది రోజుల తర్వాత ఇంటికి చేరుకున్నారు.
ఇప్పటికే ఆరెంజ్ అలెర్ట్ జారీ
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కూడా తీరం దాటింది. ఏపీ, ఒడిసాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలను హెచ్చరించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు ఇప్పటికే ప్రభుత్వం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. అతి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు
కోస్తాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీచేశారు. నైరుతి నుంచి గంటకు 30 కిలోమీటర్ల వేగంగో గాలులు వీస్తున్నాయి. సాయంత్రం సమయంలో కూడా గంటకు 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అంచనా ప్రకారం తక్కువ సమయంలో అధిక వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేశారు.












Click it and Unblock the Notifications