ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నల్లారి కిరణ్కుమార్రెడ్డి?
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కలిగించేందుకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శైలజానాథ్ ప్రెస్మీట్లకే పరిమితమవుతున్నారు. అంతకు ముందున్న రఘువీరారెడ్డి కూడా అలాగే ఉండటంతో పీసీసీ చీఫ్ను మార్చి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
సోనియాకు, రాహుల్ కు ఏకైక ఆప్షన్?
ఈ ఆలోచన కలిగిన తర్వాత సోనియాకు, రాహుల్కు ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఒక్కరే కనిపిస్తున్నారు. వారు, వీరు కాకుండా ప్రజల్లో ఇమేజ్ ఉన్న నేతను పెడితే పార్టీ పుంజుకోవడం ఖాయమని, కొంచెం కష్టపడితే బలపడటం కూడా ఖాయమని రాహుల్ గట్టిగా నమ్ముతున్నారు. కిరణ్కుమార్రెడ్డిని పీసీసీ చీఫ్గా నియమిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఉంటాయని నమ్ముతున్నారు. గతంలో ఆయన స్నేహితులుగా ఉన్నవారు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరితే బలపడటం సులువుగా జరుగుతుందని భావిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకం
ఉమ్మడి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కిరణ్కుమార్రెడ్డి ఆ తర్వాత జైసమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరి తెరవెనక సహకారం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇమేజ్, ప్రజల్లో పలుకుబడి ఉన్న నేత కిరణ్కుమార్రెడ్డి ఒక్కరే. 2024 లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకం. రాజస్థాన్లోని ఉదయ్ పూర్లో తాజాగా ముగిసిన నవసంకల్ప్ చింతన శిబిర్లో మేథోమథనం జరిగింది. ఏపీకి సంబంధించి కిరణ్కుమార్రెడ్డిని నియమించాలని పార్టీ అగ్రనేతలు చర్చించినట్లు సమాచారం.
శ్రేణుల్లో కదలిక వస్తుంది
కిరణ్కుమార్రెడ్డిని ఒప్పించి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ శ్రేణుల్లో కదలిక వస్తుందని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. అంతేకాకుండా వైసీపీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వెనక్కి వస్తాయనే అంచనాలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎలాగైనా నల్లారిని ఒప్పించి బాధ్యతలు అప్పగించాలని రాహుల్, సోనియా భావిస్తున్నారు. కిరణ్కుమార్రెడ్డికూడా అంగీకరిస్తే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయాత్మకశక్తిగా ఎదుగుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.