ఏపీలో మరో వరం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనేక పథకాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా మరో పథకాన్ని పొడిగించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన ఆరోగ్య పథకాన్ని వచ్చే ఏడాది వరకు పొడిగించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తిస్తుందంటూ సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం తరహాలోనే వర్కింగ్ జర్నలిస్టులు కూడా దీనిద్వారా వైద్యసేవలు పొందుతారు.
ఆదాయ పరిమితులు లేవు
వైద్యసేవలు పొందే విషయంలో ఎటువంటి ఆదాయ పరిమితులు ఉండవు. రాష్ట్రవ్యాప్తంగా అక్రిడిటేషన్ ఉన్న పాత్రికేయులంతా ఈ పథకానికి అర్హులే. అక్రిడిటేషన్ ఉన్నప్పటికీ ఎవరైతే హెల్త్ స్కీం పొందలేదో వారు మాత్రం అనర్హులు. ఇప్పటివరకు హెల్త్ స్కీంకు అర్హులైనవారికే ఈ పొడిగింపు వర్తిస్తుంది. దీనిద్వారా పాత్రికేయులు, వారి కుటుంబ సభ్యులు సంవత్సరం మొత్తంమీద ఎన్నిసార్లైనా రూ.2 లక్షల విలువైన వైద్య చికిత్సలు పొందవచ్చు. దీనిపై పాత్రికేయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నింటికీ పేర్లు మార్చారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు 2014-19 సమయంలో తమ ప్రభుత్వంలో ఏ పథకాలకు ఏ పేర్లైతే ఉన్నాయో వాటిని తిరిగి పెట్టారు. తాజాగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్టీఆర్ వైద్యసేవగా మార్చారు.

ఆధ్యాత్మిక ఆనందం కావాలి
గుంటూరు జిల్లా కొలనుకొండలో ఉన్న హరేకృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంత శేషస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచి పనులు చేయాలనుకునే ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆహ్వానిస్తోందని, వారికి ఇకనుంచి ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు అడ్డుపడవన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలోనే అన్న క్యాంటిన్లను పున:ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. హరేకృష్ణ సంస్థ నుంచి ప్రతిఒక్కరూ స్ఫూర్తి పొందాలన్నారు. ఆధ్యాత్మికత ద్వారా మానసిక ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందాలని, అది లేకపోతే జీవితంలో ఎవరూ ముందుకు వెళ్లలేరన్నారు.












Click it and Unblock the Notifications