ఇకపై వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1 లో.. !!
తిరుమల శ్రీవారి ఆలయంలో నేడు సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాల నేపథ్యంలో తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోతోంది. నారాయణుడి నామస్మరణతో పులకించిపోతోంది. అశేష భక్తజనావళికి ఓ దివ్యానుభూతిని పంచుతోంది. తిరుమల అన్ని రోడ్లు, కూడళలో పూలతో చేసిన స్వామివారి నిలువెత్తు కటౌట్లను అమర్చారు.
బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి సేనాధిపతి శ్రీవిష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుట్టమన్నులో నవధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు అర్చకులు.

ఈ సాయంత్రం 6.21 నుండి 6.35 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. ముక్కోటి దేవతలనూ బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 16న ఉదయం తిరుమలలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్-1 లో నూతనంగా ఏర్పాటు చేసిన పిల్ గ్రిమ్ ఎక్స్ పీరియన్స్ సెంటర్, ఎస్వీ మ్యూజియం, ఎలక్ట్రిక్ బస్సులు, నందకం యాప్, భక్తులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రారంభిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో కీలకమైన గరుడసేవ నాడు 38 శాతం అదనంగా అన్న ప్రసాదాలును పెంచనుంది టీటీడీ. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని శ్రీవారి ఆలయంలో 30 శాతం అదనంగా స్వామివారి ప్రసాదాలు అందిస్తామని కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర తెలిపారు. అలాగే టీ, కాఫీ, పాలు, మజ్జిగ వంటి పానియాలను 50 శాతం అదనంగా పెంచుతున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సులు 500 ట్రిప్పులు అదనంగా పెంచనుంది. మొత్తంగా 3,100 ట్రిప్పుల మేర ఏపీఎస్ఆర్టీసీ బస్సులను నడిపించనుంది.
వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడం, దీనికోసం స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. సూర్యాస్తమయం తరువాతే అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. విత్తనాలు నాటడానికి మట్టి కుండలను వినియోగిస్తారు. అంకురార్పణ నిర్వహించే ప్రదేశంలో బ్రహ్మపీఠాన్ని ఏర్పాటుచేస్తారు.
అగ్ని ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఇసాన, జయ అనే దేవతలను ఆహ్వానిస్తారు. ఆ తరువాత భూమాతను ప్రార్థిస్తూ పాలికలను మట్టితో నింపుతారు. చంద్రుడిని ప్రార్థిస్తూ అందులో విత్తనాలు చల్లి నీరు పోస్తారు. ఈ పాలికలకు నూతన వస్త్రాన్ని అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తం పఠిస్తారు. ప్రతిరోజూ ఈ పాలికల్లో కొద్దిగా నీరు పోస్తారు. ధ్వజావరోహణం నాడు ఈ మొలకలను నీటిలో వదలుతారు.















Click it and Unblock the Notifications
