రైలు పట్టాలు దాటుతున్నారా? అయితే మీకే ఈ హెచ్చరిక!
రైలు వచ్చే లోపు పట్టాలు దాటేసి పక్క ప్లాట్ ఫాం మీదికి వెళ్ళిపోతాం లే.. మళ్ళీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎవరు ఎక్కుతారు అనుకుంటూ చాలా మంది రైలు పట్టాలను దాటాలని ప్రయత్నించి ఊహించని విధంగా ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.దేశ వ్యాప్తంగా ఇది చాలా పెద్ద సమస్యగా మారింది.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2023లో భారత్లో 24,678 రైల్వే ప్రమాదాలు జరిగాయి. వీటిలో 21,803 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 15,878 మంది అంటే దాదాపు 73 శాతం రైలు నుంచి పడిపోవడం లేదా పట్టాలపై నడుస్తూ రైలు ఢీకొనడం వల్లే మరణించారు. 2024లో ఈ సంఖ్య మరింత పెరిగి 22,413 మరణాలు నమోదయ్యాయి. పట్టాలపై నడుస్తుండగా ఢీకొనడం, పడిపోవడం వల్లే 17,029 మంది చనిపోయారు.

తెలంగాణలో పరిస్థితి మరింత దారుణం. సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ పరిధిలోనే ఏటా 1,200 నుంచి 1,300 మంది పట్టాలపై ప్రాణాలు కోల్పోతున్నారు. 2024లో మొత్తం 1,571మరణాలు నమోదయ్యాయి. వీటిలో ప్రమాదాల వల్ల 735, ఆత్మహత్యల వల్ల 630, సహజ కారణాల వల్ల 206 మంది మృతి చెందారు. 2025లో కొంత తగ్గినప్పటికీ 1,317మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరు, ముగ్గురు రైలు ప్రమాదాల్లో చనిపోతున్నారని రికార్డులు చూపిస్తున్నాయి.
ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు? చాలామంది ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఎక్కకుండా పట్టాలు దాటడం వలన, మొబైల్ చూస్తూ నడవడం, రైలు వేగాన్ని తక్కువగా అంచనా వేయడం, ఆగి ఉన్న రైలు కింద నుంచి వెళ్లడం, రీల్స్ మోజులో రైలు వచ్చేది చూడకపోవటం వంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు.
రైలు పట్టాలు దాటుతూ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోకుండా స్టేషన్లో ఒక ప్లాట్ఫాం నుంచి మరో ప్లాట్ ఫాం కు వెళ్ళటానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు లేదా ఎస్కలేటర్ వాడండి. పట్టాలపై నడవకండి. రైలు పూర్తిగా ఆగిన తర్వాతే ఎక్కండి. ఆగిన తర్వాతే దిగండి. ప్లాట్ఫాం అంచు నుంచి దూరంగా నిలబడండి. ఒక్క 5 నిముషాల సమయం కన్నా ప్రాణం చాలా విలువైనది.












Click it and Unblock the Notifications
