మరో అల్పపీడనం: ఏపీ హైఅలర్ట్: ఆ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణల్లో కురిసిన భారీ వర్షాల వల్ల గోదావరి వరద నీటితో పోటెత్తుతోంది. తీర ప్రాంత గ్రామాలను ముంచెత్తుతోంది. పోలవరం సహా పలు లంక గ్రామాలు వరద ముంపునకు గురవుతున్నాయి. వరద ఉధృతి నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలవరం ప్రాజెక్ట్, ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను అధికారులు ఎత్తేశారు. వరద నీటిని దిగువకు వదిలి వేస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా తీరానికి అనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బీ ఆర్ అంబేద్కర్ చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉత్తర-దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడుతుందని అంచనా వేస్తోన్నట్లు చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతుందని పేర్కొన్నారు.
ముంచంగిపుట్టులో అత్యధికంగా 82 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చింతూరు-80, నక్కపల్లి-55, అరకు-43, తొండంగి-41 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసింది. పెదగంట్యాడ-23, పెందుర్తి-23, గాజువాక-15, అనకాపల్లి-14, మహారాణిపేట-13, గోపాలపట్నం-13, భీమిలి-11, జగదాంబ-8, స్టీల్ ప్లాంట్-8, డాల్ఫిన్ నోస్-6 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.
ఎగువ నుంచి వస్తున్న వరద, భారీ వర్షాల నేపధ్యంలో గోదావరికి వరద ప్రవాహం చేరుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. వరద ఉధృతి అధికంగా ఉన్న జిల్లాల్లో జాతీయ, రాష్ట్రీయ విపత్తు నిర్వహణ బలగాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని సూచించినట్లు చెప్పారు.