నిమ్మగడ్డ వైపే సుప్రీం మొగ్గు: హైకోర్టు తీర్పునకు సమర్థన: రాజ్యాంగంతో గేమ్స్ వద్దంటూ ఫైర్
అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం ప్రభుత్వ వ్యవహార శైలిని తప్పు పట్టింది. రాజ్యాంగ పదవులతో ఆడుకోవద్దంటూ నిప్పులు చెరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలను చేసింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.
చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!
రెండు వారాల్లోగా నివేదిక..
స్టే ఇవ్వడానికి అవసరమైన ఒక్క సహేతుక కారణాన్ని కూడా ప్రభుత్వం చెప్పలేకపోయిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ను నియమించడం, పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ తీసుకొచ్చిన సంస్కరణలు సరి కాదంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వానికి నోటీసులను జారీ చేసింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
స్పెషల్ లీవ్ పిటీషన్పై
నిమ్మగడ్డ రమేష్కుమార్ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పునర్నియమించాలని ఆదేశిస్తూ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్పై కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టు విచారణ ముగించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ స్పెషల్ లీవ్ పిటీషన్ను విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ వాదనలను వినిపించారు.
రాజకీయాలకు అతీతంగా..
ఇదే వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు పిటీషన్లు దాఖలు అయ్యాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు మస్తాన్ వలి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యురో సభ్యుడు వర్ల రామయ్య పిటీషన్లను దాఖలు చేశారు. వాటన్నింటినీ జోడించి, ఒకే పిటీషన్ కింద సుప్రీంకోర్టు విచారణను నిర్వహించింది బెంచ్. హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడానికి ప్రతికూలంగా వారంతా వేర్వేరుగా కెవియట్లను దాఖలు చేశారు.
నిమ్మగడ్డ బాధ్యతల స్వీకరణ ఇక లాంఛనప్రాయమే
నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంలో పరస్పర భిన్నాభిప్రాయాలు, భిన్న సిద్ధాంతాలు కలిగిన మూడు పార్టీలు ఏకం అయ్యాయి. దీన్నిబట్టి చూస్తే.. ఈ వ్యవహరాం అంతా రాష్ట్ర రాజకీయాలతో ఏ రకంగా పెనవేసుకుని పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల మధ్య రమేష్ కుమార్ భవితవ్యం ఏమిటనేది సుప్రీంకోర్టు తేల్చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఫలితంగా- ఇక నిమ్మగడ్డ రమేష్కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలను చేపట్టడం లాంఛనప్రాయమేననే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
Recommended Video
సుప్రీం కీలక వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా బొబ్డే సారథ్యంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వానికి హితబోధ చేసింది. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి అంగీకరించట్లేదని పేర్కొంది. స్టే ఇవ్వడానికి అవసరమైన సహేతుక, సంతృప్తికర కారణాలను ఏపీ ప్రభుత్వం తమ ముందు ఉంచలేకపోయిందని అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ వంటి కీలకమైన రాజ్యంగ వ్యవస్థలతో ఆటలు తగవని పేర్కొంది. తప్పులతో నిండి ఉన్న ఇలాంటి ఆర్డినెన్స్ ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించింది. రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ప్రతివాదులకు నోటీసులను జారీ చేసింది.