పవన్ కూడా కాపాడలేడు..బాలినేనికి టీడీపీ ఎమ్మెల్యే ఘాటు వార్నింగ్..!
ఏపీలో వైసీపీ ఓటమి పాలయ్యాక ఆ పార్టీని వీడి కూటమి పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్న నేతలకు ప్రతిఘటన తప్పడం లేదు. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరేందుకు అన్నీ సిద్దం చేసుకున్న వేళ షాకులు తప్పడం లేదు. ఇప్పటికే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ న కలిసి ఆ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న బాలినేనికి సొంత నియోజకవర్గం ఒంగోలులో రాజకీయ ప్రత్యర్థి అయిన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల షాకిచ్చారు.
వైసీపీ హయాంలో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు సాగించిన అవినీతిపై ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తాజాగా విరుచుకుపడ్డారు. అవినీతి కుంభకోణాల నుంచి బాలినేనిని పవన్ కళ్యాణ్ రక్షిస్తాడేమో చూస్తా అంటూ నేరుగానే హెచ్చరికలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు పోరాటం చేశామని, ఒంగోలులో టీడీపీ శ్రేణులపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి అక్రమ కేసులు పెట్టించారని, తనపైనే 32 కేసులు పెట్టారని దామచర్ల గుర్తుచేసుకున్నారు.

తమ నాయకుడు చంద్రబాబుని కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి దూషించారని, అధికారంపోయి 100 రోజులు గడవకముందే బాలినేని పార్టీ మారుతున్నారని దామచర్ల ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో వైసీపీని సర్వనాశనం చేసిన బాలినేని, జనసేనలో చేరకముందే బెదిరింపులకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఏ పార్టీలోకి వెళ్ళినా కేసుల్లో నుండి బాలినేని, ఆయన కొడుకు తప్పించుకోలేరంటూ దామచర్ల హెచ్చరికలు జారీ చేశారు.
వీటిపై బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా స్పందించారు. తనపై అవినీతి ఆరోపణలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది కదా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని దామచర్లను ప్రశ్నించారు. జనసేనలో చేరుతున్న నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకే దామచర్ల ఇలాంటి విమర్శలు చేస్తున్నారని బాలినేని తెలిపారు. ఇది సరికాదన్నారు.












Click it and Unblock the Notifications