చంద్రబాబుకు మరో షాక్-హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. తనను జ్యూడిషియల్ రిమాండ్ కాకుండా హౌస్ రిమాండ్ ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న విచారణ జరిపిన విజయవాడ ఏసీబీ కోర్టు.. ఇవాళ తీర్పు వెలువరించింది. చంద్రబాబు విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో రెండు రోజుల క్రితం సీఐడీ అధికారులు చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసి 24 గంటల తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అనంతరం ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత ఆయన జ్యుడిషియల్ రిమాండ్ ను హౌస్ రిమాండ్ గా మార్చాలని కోరుతూ న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై నిన్న ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. వీవీఐపీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో భద్రత ఉండదని, ఎన్ఎస్జీ భద్రత లేకుండా చంద్రబాబును ఉంచడం సరికాదని లాయర్లు వాదించారు. అయితే సీఐడీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రాజమండ్రి జైల్లో ప్రత్యేక భద్రత కల్పించిందని కోర్టుకు తెలిపింది. దీంతో సీఐడీ వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు.. ఈ పిటిషన్ ను కొట్టేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఇప్పటికే చంద్రబాబు హైకోర్టులో తన రిమాండ్ రద్దు చేయాలని కోరుతూ ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగబోతోంది. ఇందులో హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఇప్పటివరకూ బెయిల్ కోసం దరఖాస్తు చేయలేదు. ఏకంగా ఈ కేసు ఎఫ్ఐఆర్, రిమాండ్ రద్దు చేయాలని మాత్రమే పిటిషన్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు నిర్ణయం కీలకం కానుంది. అదే సమయంలో చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ దాఖలు చేసిన మరో పిటిషన్ పై రేపు ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది.












Click it and Unblock the Notifications