టిటిడిలో మరో టికెట్ల స్కామ్...వరుస కుంభకోణాలపై సర్వత్రా ఆందోళన
తిరుమల: తిరుమలలో ఎన్నిఅధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. తిరుమలలో ఏడుకొండలస్వామి భక్తులను దళారులు ఏదోరకంగా దోచుకుంటూనే ఉన్నారు. ఇటీవలే నకిలీ ఆన్ లైన్ టికెట్లతో భక్తులను మోసగించిన ఉదంతం మరువకముందే తాజాగా నకిలీ దర్శనం టికెట్లతో భక్తులను, టిటిడిని మోసగించిన ఉదంతం మరొకటి వెలుగుచూసింది.
శ్రీవారి ఆలయంలో రూ.300 దర్శన టికెట్ల జిరాక్స్ కాపీలను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యవహారం బైటపడటంతో కలకలం రేగింది. తద్వారా భక్తులను మోసగించడటమే కాకుండా స్వామివారి ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇందుకు ఇంటిదొంగలే సాయపడుతున్నట్లు టీటీడీ విజిలెన్సు నిఘాలో సోమవారం వెలుగుచూసింది. ఈ స్కామ్ వివరాలను వీజీవో సదాలక్ష్మితో కలిసి టీటీడీ సీవీఎస్వో రవికృష్ణ సోమవారం మీడియాకు వెల్లడించారు.
స్కామ్ సూత్రధారులు...
రూ.300 ఆన్లైన్ టికెట్ల స్కానింగ్ కౌంటర్లో పనిచేసే సురేంద్ర, కనకరాజు అనే ఉద్యోగులు దళారీ వాసుతో చేతులు కలిపారు. తిరుపతిలోని ఓ లాడ్జిలో దిగిన భక్తులకు దర్శనం చేయిస్తానని వాసు వారిని తిరుమలకు తీసుకొచ్చాడు. కౌంటర్లోని సిబ్బంది సహకారంతో 25వ తేదీకి సంబంధించిన రూ.300 ఆన్లైన్ టికెట్ను జెరాక్సు తీయించారు. 25 మంది భక్తులకు ఒక్కొక్కటి రూ.1000 చొప్పున విక్రయించారు.
దందా నడిపించేది ఇలా...
టికెట్పై ఉన్న బార్ కోడ్ను ఒకసారి స్కాన్ చేస్తే మరోసారి స్కాన్ కాదు. అలా స్కాన్ కానప్పుడు ఆ భక్తులను ఆలయంలోకి అనుమతించరు. వాసుతో చేతులు కలిపిన కనకరాజు, సురేంద్ర మాత్రం జెరాక్స్ చేసిన టికెట్లను స్కాన్ చేసినట్లు నటించి తొలుత 10 మందిని ఆలయంలోకి పంపారు. తర్వాత మరో 15 మందినీ దర్శనానికి అనుమతిస్తుండగా టిటిడి విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు.
చాలా కాలంగా దందా...
ఈ వ్యవహారంపై పక్కా సమాచారంతోనే వాసును, కనకరాజు, సురేంద్రను విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ దందా చాలా రోజుల నుంచి జరుగుతున్నట్లు తెలిసిందని టిటిడి ఛీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ రవికృష్ణ తెలిపారు.
గతం లోనూ దందా...
గతంలోనూ ఈ తరహా దందా టిటిడిలో చోటుచేసుకుంది. 2012 నవంబరు నుంచి 2013 మే నెల వరకు కొంత మంది సిబ్బంది శీఘ్రదర్శనం రూ.300 టికెట్లు కేటాయించే విషయంలోనూ ఇలాగే చేతివాటం చూపారు. ప్రింట్ తీసే సమయంలో కార్బన్ పేపరు పెట్టి డూప్లికేట్ టికెట్లను జారీ చేశారు. ఈ టికెట్లకు బార్ కోడ్ లేదు. ఇలా 21 వేల నకిలీ టికెట్లను విక్రయించారు. సుమారు రూ.10 లక్షల ఆదాయానికి గండికొట్టారు. అనంతరం టికెట్లపై బార్కోడ్ ప్రవేశపెట్టారు. అయినా కౌంటరు సిబ్బంది సహకారంతో దళారులు ఇలి జెరాక్స్ టికెట్లతో భక్తులను దర్శనానికి పంపడం విజిలెన్స్ సిబ్బందిని విస్మయానికి గురిచేసింది. ఇకపై ఇలాంటి అక్రమాలకు పాల్పడే సిబ్బంది పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని టిటిడి అధికారులు చెబుతున్నారు.